సత్తుపల్లి, ఆగస్టు 22 : ‘ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి, సంక్షేమంలో నెంబర్వన్గా నిలపడమే తన ధ్యేయం. ప్రతి రంగంలో అభివృద్ధి చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేశా’ అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సీఎం కేసీఆర్ సత్తుపల్లి బీఆర్ఎస్ అభ్యర్థిగా తనను ప్రకటించడం ఆనందంగా ఉందన్న ఆయన మంగళవారం ‘నమస్తే’కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
ప్రశ్న : నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమిటి?
జవాబు : సీఎం కేసీఆర్, వివిధ శాఖల మంత్రుల ద్వారా రూ.1000కోట్లకు పైగా అభివృద్ధి నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించాం. రూ.150కోట్లతో బీటీ రోడ్లు, రూ.180కోట్లతో పీఆర్ రోడ్లు, రూ.55కోట్లతో చెక్డ్యామ్లు నిర్మించాం. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో రోడ్లు లేని గ్రామంగా తీర్చిదిద్దా.
ప్ర : వైద్యరంగంపై మీ మార్కు ఏమిటి?
జ : నియోజకవర్గాన్ని వైద్యరంగంలో అన్నిరంగాల్లో ముందుంచా. మంత్రి హరీశ్రావు సహకారంతో న్ని రకాల వైద్యసేవలు అందించేలా కృషి చేస్తా. ఇప్పటికే సత్తుపల్లిలో రూ.35కోట్లతో 100 పడకలతో నిర్మించిన ఆస్పత్రి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. కల్లూరులో రూ.11.50కోట్లతో 50 పడకల ఆస్పత్రి, పెనుబల్లిలో రూ.8.50కోట్లతో 50 పడకల ఆస్పత్రి నిర్మాణాలు కొనసాగుతున్నాయి. 20 పల్లె, మరో 15 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశాం. వేంసూరు, తల్లాడ పీహెచ్సీలను ఆధునీకరించాం. సత్తుపల్లి ఆస్పత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించాం.
ప్ర : విద్యాభివృద్ధికి చేసిన కృషి ఏమిటి?
జ : విద్యాభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి సారించా. ఇటీవల ప్రభుత్వం సత్తుపల్లికి పాలిటెక్నిక్, నర్సింగ్ కళాశాల మంజూరు చేసింది. మన ఊరు-మనబడి ద్వారా 120 పాఠశాలలను ఆధునీకరించాం. సత్తుపల్లి జూనియర్ కళాశాలకు నూతన భవన నిర్మాణం, వేంసూరు మండలం కందుకూరులో నూతన జూనియర్ కళాశాల ఏర్పాటు చేయనున్నాం.
ప్ర : మున్సిపాలిటీ అభివృద్ధిపై మీ అభిప్రాయం?
జ : సత్తుపల్లి మున్సిపాలిటీని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో వందల కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశాం. ఇప్పటికే రూ.3.50కోట్లతో నూతన మున్సిపల్ భవనం, అర్బన్ పార్కు, రూ.5కోట్లతో వేశ్యకాంతల చెరువు ఆధునీకరణ, రూ.2.50కోట్లతో షాదీఖానా, మరో రూ.2.50కోట్లతో ఆధునిక దోభీఘాట్, సుమారు రూ.100కోట్లతో సీసీ, బీటీ రోడ్లు, పలు అభివృద్ధి పనులు చేశాం. కల్లూరులో రూ.3.50కోట్లతో స్టేడియం, నూతన బస్టాండ్ నిర్మాణం చేపట్టాం.
ప్ర : కల్లూరు, తల్లాడల్లో మీ ఆశయం ఏమిటి?
జ : కల్లూరు, తల్లాడలో ఫోర్ లేన్ ఏర్పాటు చేసి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం ఆశయం. కల్లూరు, తల్లాడకు సీఎం కేసీఆర్ ఇచ్చిన రూ.20కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తాం.
ప్ర : నిరుద్యోగ యువతకు ఉపాధి ఏమిటి?
జ : ఇప్పటికే రెండు మెగా జాబ్మేళాలు ఏర్పాటు చేసి 1,500 మందికి పైగా ఉద్యోగాలు కల్పించాం. బుగ్గపాడు ఫుడ్పార్కు త్వరలో ప్రారంభించి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.
ప్ర : ఎన్నికల ప్రణాళిక ఏమిటి?
జ : నియోజకవర్గంలో ఇప్పటికే మూడుసార్లు ప్రజలు నన్ను గెలిపించారు. ఇన్నాళ్లు పరిపాలించిన ప్రతిపక్షాలు చేయలేని పని తొమ్మిదేళ్ల కాలంలో సీఎం కేసీఆర్ చేసి చూపించారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులే తన విజయానికి వారధులుగా పనిచేస్తారు. మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారు. నియోజకవర్గ ప్రజలు తనను ఎప్పుడూ ఆశీర్వదిస్తారు.