భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, ఏప్రిల్ 7 : గల్లీ కేక ఢిల్లీకి వినపడేలా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు స్పష్టం చేశారు. తెలంగాణ ధాన్యాన్ని కొనేదాకా కేంద్రాన్ని వదిలిపెట్టబోమని తేల్చిచెప్పారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ అధిష్ఠానం ఇచ్చిన పిలుపుమేరకు భద్రాద్రి జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్లో గురువారం నిర్వహించిన మహాధర్నాలో ఆయన మాట్లాడారు. కేంద్రంపై యుద్ధానికి ఇది అంతం కాదని, ఆరంభం మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ గద్దె దిగేవరకు పోరాటం ఆగదని తేల్చిచెప్పారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అన్ని వేళలా అండగా ఉంటోందనిన్నారు. దీంతో భూమికి బరువు అయ్యేంతగా రైతులు పంటలు పండిస్తున్నారన్నారు. కానీ ధాన్యం సేకరణలో మాత్రం కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. కేంద్రం వైఖరి వల్లనే తెలంగాణ రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. కేంద్రం తెలంగాణ ధాన్యాన్ని కొనుగోలు చేయబోనని చెప్పడం వల్లనే తెలంగాణ ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమై యాసంగిలో వరి పంట వేయొద్దని రైతులకు సూచించిందని గుర్తుచేశారు. బీజేపీ రాష్ట్ర నాయకులు మాత్రం కేంద్రం కొనుగోలు చేస్తుందని, రైతులు వరి వేసుకోవచ్చని బీరాలు పలికారని గుర్తుచేశారు. ఇప్పుడు రాష్ట్రమే కొనాలని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నాయకులకు అబద్ధాలు కొత్త కాదని, గతంలో బాండ్ పేపర్ రాసిచ్చి మరీ రైతులను, ప్రజలను మోసం చేశారని, ఆ విషయాలను ప్రజలు గమనించాలని గుర్తుచేశారు. రానున్న రోజుల్లో రైతు ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. గురువారం నుంచి తెలంగాణ ప్రతి ఇంటిపైనా నల్లజెండా ఎగరాలన్నారు. ఈ నెల 11న ఢిల్లీలో సీఎం కేసీఆర్ దీక్ష చేపడతారని అన్నారు. రైతుల కోసం అహర్నిశలూ పోరాడుతున్న సీఎం కేసీఆర్కు మద్దతుగా నిలవాలని ప్రజలకు, రైతులకు పిలుపునిచ్చారు. మహాధర్నా అనంతరం ర్యాలీగా వెళ్లిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.. కలెక్టర్ను కలిసి వినతి పత్రాన్ని అందించారు. జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్, కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపల్ చైర్మన్లు కాపు సీతాలక్ష్మి, దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, సొసైటీ చైర్మన్ మండే వీరహనుమంతరావు, అన్ని మండలాల టీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
వడ్లు కొనాల్సిందే
కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ రైతుల వడ్లు కొనాల్సిందే. లేదంటే కొనేదాకా పోరాడుతాం. ప్రతి ఇంటిపైనా నల్లజెండాతో నిరసన తెలుపుతాం. మన పిలుపు ఢిల్లీకి వినడాలి. ఈ నిరసనలు ఇంతటితో ఆగేవి కావు. రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదు. బీజేపీ నాయకులు ఇక్కడో మాట అక్కడో మాట మాట్లాడుతున్నారు.
– వనమా వెంకటేశ్వరరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే
ఎవరి కోసం కొంటారు?
రైతుల సంక్షేమం అంటూ అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇప్పుడు రైతులకు వెన్నుపోటు పొడుస్తోంది. తెలంగాణ రైతుల ధాన్యాన్ని కేంద్రం కొనాల్సిందే. ఎవరి కోసం కొంటారు? కొనేదాకా వదిలేది లేదు. తెలంగాణ తడాఖా చూపిస్తాం. రైతుల ఉద్యమం అంటే ఏంటో కేంద్ర ప్రభుత్వానికి రుచి చూపిస్తాం.
– మెచ్చా నాగేశ్వరరావు, అశ్వారావుపేట ఎమ్మెల్యే
తేనె తుట్టెను కదపాలని చూడకండి
తేనె తుట్టెను కదిపినట్లు తెలంగాణ బిడ్డలను రెచ్చగొడితే అంతుచూసేదాకా వదలరు. చెమటోడ్చి కష్టపడి పండించిన పంటను తెలంగాణ సేకరిస్తుంది. దానిని కేంద్ర ప్రభుత్వం కొనితీరాల్సిందే. అది కేంద్ర ప్రభుత్వ బాధ్యత. రైతులను మోసం చేయాలని చూస్తే ఊరుకోం. 11న ఢిల్లీకి వెళ్దాం. తెలంగాణ సత్తా చూపిస్తాం.
– తెల్లం వెంకటరావు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి
పంజాబ్ రైతులు సాధించుకున్నారు
పోరాటాలు చేసి పంజాబ్ రైతులు సాధించుకున్నారు. వారికి ఒక న్యాయం మనకో న్యాయమా? ఇంత దారుణంగా రైతుల్ని మోసం చేస్తే ఎవరూ చూస్తూ ఊరుకోరు. బీజేపీకి ఘోరీ కడతాం. కేంద్రం ఇన్నిసార్లు డీజిల్, పెట్రోల్ రేట్లు పెంచింది. ఇప్పుడు రైతుల పంటను కొనుగోలు చేయనంటోంది. కొనే వరకూ కేంద్రాన్ని వదలం.
– హరిప్రియా నాయక్, ఇల్లెందు ఎమ్మెల్యే
విల్లంబులతో ఢిల్లీకొస్తారు
ధాన్యం కొనకుండా ప్రధాని మోదీ తెలంగాణ రైతులను మోసం చేస్తున్నారు. ఇంత అన్యాయం చేస్తే ఊరుకోం. వడ్లు కొనకపోతే గిరిజన రైతులు తడాఖా ఏంటో చూపిస్తాం. మన్యంలో పోరాటాలు చేసిన చరిత్ర గిరిజనులకు కొత్త కాదు. పోరాటాల చరిత్ర గిరిజన జాతికి ఉంది. గిరిజన రైతులంతా విల్లంబులు పట్టుకుని ఢిల్లీ వస్తారు జాగ్రత్త.
– కోరం కనకయ్య, జడ్పీ చైర్మన్
కలిసి కట్టుగా ఉద్యమం చేద్దాం
ప్రధాని మోదీ గద్దె దిగే దాకా కలిసి కట్టుగా ఉద్యమం చేద్దాం. తాడో పేడో తేల్చుకుందాం. తెలంగాణ సాధించేందుకు పట్టువదలని విక్రమార్కుల్లా ఉద్యమం చేశాం. అదే రీతిలో తెలంగాణ ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసే దాకా ఉద్యమిస్తాం. పోరాట పటిమ గల నాయకత్వం మనకు అండగా ఉంది. ఇక పోరాటం ఆగదు.
– దిండిగల రాజేందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్