భద్రాచలం, డిసెంబర్ 15 : భద్రాద్రి దివ్యక్షేత్రంలో ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు అత్యంత వైభవోపేతంగా సాగుతున్నాయి. సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అధ్యయనోత్సవాల్లో భాగంగా శుక్రవారం వైకుంఠ రాముడు వరాహావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దీంతో పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని పరవశించిపోయారు. ఉదయం బేడా మండపంలో స్వామివారి ఉత్సవ మూర్తులకు, నిత్య కల్యాణ మూర్తులకు ప్రత్యేక అభిషేకాలు చేసి అర్చనలు చేపట్టారు. అనంతరం ఉత్సవ మూర్తులను అంతరాలయంలోనికి తీసుకెళ్లి వరాహావతారంగా అలంకరించారు. పూజలు నిర్వహించి బేడా మండపానికి తీసుకొచ్చి ముందుగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచన తదితర కార్యక్రమాలు జరిపారు. స్వామివారికి నాళాయిర దివ్య ప్రబంధంలోని 200 పాశురాలు విన్నవించి.. వేద పారాయణం, వేద విన్నపాలు చేసి భక్తులు దర్శించుకునేందుకు వీలుగా బేడా మండపంలో స్వామివారిని వేంచేపు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు స్వామివారిని సమస్త మంగళ వాయిద్యాలు, వేద పారాయణాలతో ప్రత్యేక పల్లకిలో గోదావరి తీరానికి తీసుకెళ్లి హారతులు సమర్పించారు. ఆ తర్వాత మిథిలా స్టేడియానికి స్వామివారిని తీసుకెళ్లి ప్రత్యేక వేదికపై వేంచేపు చేయగా.. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి వరాహారూపంలో ఉన్న రామయ్యను దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం స్వామివారికి తాతగుడి సెంటర్ వరకు తిరువీధి సేవ నిర్వహించారు. తర్వాత స్వామివారిని ఆలయానికి తీసుకొచ్చి దర్బార్ సేవ నిర్వహించారు. మిథిలా స్టేడియంలో నిర్వహిస్తున్న కూచిపూడి నృత్యాలు, హరికథలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తుల మదిని దోచాయి. కార్యక్రమంలో దేవస్థానం ఈఓ ఎల్.రమాదేవి, ప్రధానార్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, అమరవాది విజయరాఘవన్, ఈఈ రవీందర్రాజు, ఆలయ పర్యవేక్షకులు లింగాల సాయిబాబా, నిరంజన్కుమార్, అర్చకులు, వేద పండితులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
పర్ణశాల, డిసెంబర్ 15 : ముక్కోటి అధ్యయనోత్సవాల్లో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన పర్ణశాల రామాలయంలో మూడో రోజు శుక్రవారం వరాహావతారంలో రామయ్య భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని అలంకరించిన అర్చకులు ఈ అవతారంపై భక్తులకు వివరించారు. ఈ రూపంలో ఉన్న స్వామివారిని రాహుగ్రహ బాధలు ఉన్న వారు దర్శించుకుంటే విముక్తులవుతారని అర్చకులు తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు శేషకిరణ్ కుమార్ చార్యులు, అమరవాది శ్రీకాంత్ చార్యులు, భరద్వాజా చార్యులు, రాజగోపాల్ చార్యులు, నరసింహాచార్యులు, ఏఈవో శ్రావణ్కుమార్, అనిల్, గుమస్తా ప్రసాద్, సిబ్బంది రాము, శివ పాల్గొన్నారు.