భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 28 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియకు ఆన్లైన్ సర్వర్స్ సహకరించడం లేదు. పోర్టల్ ఎప్పుడు తెరుచుకుంటుందో తెలియదు. ఎప్పుడు తెరుచుకోదో తెలియక పట్టభద్రులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఓటు నమోదు ప్రక్రియ భద్రాద్రి జిల్లాలో మందికొడిగా సాగుతున్నది. గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో జిల్లావ్యాప్తంగా 44 వేల మంది పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. వీరంతా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో డిగ్రీ పూర్తి చేసిన వారి సంఖ్య 55 వేలకు పైగా చేరింది. వీరిలో కేవలం 13,365 మంది మాత్రమే ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్నట్లు సమాచారం. ఆన్లైన్ చేసుకున్న ఓటర్ల వద్దకు బీఎల్వోలు వెరిఫికేషన్కు రాకపోవడంతో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు తమకు ఓటు హక్కు వస్తుందా.. రాదా.. అనే సందిగ్ధంలో ఉన్నారు.
జిల్లాలో డిగ్రీ పూర్తి చేసిన వారు 55 వేల మందికి పైగా ఇప్పటివరకు సగమంది కూడా ఓటు హక్కు కోసం నమోదు చేసుకోలేదని తెలుస్తున్నది. యంత్రాంగం అంతంతమాత్రంగా ప్రచారం చేయడం, ఆన్లైన్లో టెక్నికల్ సమస్యలకు పరిష్కారం చూపకపోవడంతోనే ఈ సమస్య అని వేరే చెప్పనక్కర్లేదు. జిల్లాలో ఎక్కువ పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ ఓటు నమోదు ప్రక్రియ కనిపిస్తున్నది. అత్యధికంగా ఇల్లెందు మండలం నుంచి 1,397 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత స్థానంలో పాల్వంచ, కొత్తగూడెం మండలాలు నిలిచాయి. పాల్వంచ మండలం నుంచి 1,389 మంది, కొత్తగూడెం మండలం నుంచి 1,333 మంది దరఖాస్తు చేసుకున్నారు. మిగతా ఏజెన్సీ మండలాల్లో ఓటు నమోదు అంతంతమాత్రమే నమోదు.
ఓటు హక్కు కోసం నమోదు చేసుకునే వారికి ఆన్లైన్ ఇబ్బందులు తప్పడం లేదు. ఆన్లైన్లో పోర్టల్ ఓపెన్ కాకపోవడంతోనే ఈ ఇబ్బందులు. సమస్యను అధికారులూ పట్టించుకోకపోవడంతో ఓటు నమోదు ప్రక్రియ ముందుకు కదలడం లేదు. దీంతో పట్టభద్రులు కూడా ఓటు నమోదు చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అధికారులు ఇప్పటికైనా స్పందించి ఆన్లైన్ సమస్యలను పరిష్కరించాలని ఓటర్లు కోరుతున్నారు.
ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నిలకు ఓటర్ల నమోదు ప్రక్రియ జరుగుతుంది. అది పూర్తయిన తర్వాత యంత్రాంగం వచ్చే నెల 6న డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. అప్పటి కల్లా ఓటరు నమోదు ప్రక్రియక పూర్తి కాకపోతే ఏప్రిల్ 24న ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఈ లోపు పట్టభద్రులు ఓటు కోసం నమోదు చేసుకోవాల్సిందే. లేకపోతే ఓటు హక్కు కోల్పోక తప్పదు.
ఓటు నమోదు చేసుకునేందుకు నేను రెండు సార్లు ఆన్లైన్ సెంటర్కు వెళ్లాను. పోర్టల్ ఓపెన్ కాకపోవడంతో ఇబ్బంది పడ్డాను. గంటల కొద్దీ ఆన్లైన్ చేసేందుకు నేను ఎదురుచూశాను. చివరకు నాకు నిరాశే ఎదురైంది. ఆఫ్లైన్లో పత్రాలు ఇద్దామంటే స్థానిక ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరూ అందుబాటులో ఉండడం లేదు.
గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన వాళ్లు కూడా మళ్లీ ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలి. ఈ విషయం తెలియక కొందరు నమోదు చేసుకోవడం లేదు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 12,365 మంది ఆన్లైన్లో ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్నారు. వాటిని బీఎల్వోలు పరిశీలిస్తున్నారు. ఆన్లైన్లో నమోదు చేసుకోని వారు మ్యానువల్గా పత్రాలను బీఎల్వోలకు ఇవ్వొచ్చు. బీఎల్వోలు ఆదివారమూ పంచాయతీ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటారు. సందేహాలేమైనా తలెత్తితే టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు.