ఖమ్మం, జూలై4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఖమ్మం జిల్లాలో వానకాలం వ్యవసాయ సాగు పనులు జోరందుకున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో రైతులు పొలాల్లో దుక్కులు పూర్తి చేసి విత్తనాలు విత్తడంలో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా పత్తి సాగు జిల్లావ్యాప్తంగా జోరుగా కొనసాగుతుండగా.. విత్తనాల నాణ్యత విషయంలో మాత్రం రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పంటల మార్పిడి కంటే సంప్రదాయ పంటలకే అన్నదాతలు ప్రాధాన్యతనిస్తున్నారు. కానీ, వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని రైతులకు సూచిస్తున్నారు.
ఖమ్మం జిల్లాలో వానకాలం సీజన్కు సంబంధించి మొత్తం సాగు విస్తీర్ణం 6.48 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 3.50 లక్షల పైచిలుకు ఎకరాల్లో విత్తనాలు పూర్తయ్యాయి. ఇందులో పత్తి పంట వాటా అత్యధికంగా నమోదవుతోంది. రైతులకు అవసరమైన విత్తనాలను ముందుగానే అందుబాటులో ఉంచినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. పత్తి విత్తనాల కొనుగోలు విషయంలో ధ్రువీకరించిన కంపెనీల విత్తనాలనే వినియోగించాలని అధికారులు సూచిస్తున్నారు. నకిలీ విత్తనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రైతులు బిల్లులు తప్పనిసరిగా తీసుకోవాలని, విత్తనాల మొలక శాతం తక్కువగా ఉంటే వెంటనే వ్యవసాయ అధికారులకు సమాచారం అందించాలన్నారు.
ఇక మిర్చి సాగుపై రైతులు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. గత సీజన్లో లభించిన ధరలు, మార్కెట్ పరిస్థితులు మిర్చి సాగుకు అనుకూలంగా మారాయి, అలాగే కూరగాయల సాగు, పప్పు ధాన్యాల సాగుపై కూడా రైతులు మొగ్గు చూపుతున్నారు. నేల ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు ఉత్పత్తి వ్యయాలు తగ్గించేందుకు పంటల మార్పిడి పద్ధతిని అవలంబించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల వారీగా రైతులతో సమావేశాలు నిర్వహించి పంటల ఎంపిక, విత్తనాల వినియోగం, ఎరువుల నిర్వహణ, పురుగు నివారణ చర్యలపై అవగాహన కల్పిస్తున్నారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు శాస్త్రీయ పద్ధతులను అనుసరించాలని సూచిస్తున్నారు.
జిల్లాలో రైతులందరికీ అవసరమైన విత్తనాలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయి. నాణ్యమైన విత్తనాల వినియోగంతోపాటు పంటల మార్పిడిని పాటిస్తే దిగుబడులు మెరుగుపడుతాయి. ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలి. రైతులు నకిలీ విత్తనాల బారిన పడకుండా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం. జిల్లావ్యాప్తంగా తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
-ధనసరి పుల్లయ్య, ఖమ్మం జిల్లా వ్యవసాయాధికారి