ఖమ్మం, మే 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలో రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేలు జరిగిందా.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనా.. అనే దానిపై బహిరంగ చర్చకు సిద్ధమా..? అని బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సవాల్ విసిరారు. మంత్రి స్వగ్రామం గండుగులపల్లి గ్రామమైనా, ఖమ్మం, హైదరాబాద్ ఎక్కడైనా సరే చర్చకు రెడీగా ఉన్నట్లు పేర్కొన్నారు.
జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావుపై మంత్రి తుమ్మల చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శనివారం ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయరంగాన్ని కేసీఆర్ విస్మరించారని మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. జిల్లాలో వ్యవసాయం 2014కు ముందు ఎలా ఉంది.. తరువాత ఎలా మారిందో మంత్రి తుమ్మలకు పూర్తిగా తెలుసునన్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన తుమ్మల పాలేరు నియోజకవర్గంలో భక్తరామదాసు ప్రాజెక్టును నిర్మించాలనే ఆలోచన ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు.
కేసీఆర్ మంత్రిగా ఇచ్చిన అవకాశంతో రాష్ట్రంలో మొట్టమొదటి నీటిపారుదల ప్రాజెక్టు ‘భక్తరామదాసు’ను తుమ్మల చేతుల మీదుగా పూర్తిచేసింది నిజంకాదా..? అని గుర్తుచేశారు. భక్తరామదాసు ద్వారా పాలేరు నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికి నీళ్లు వచ్చింది నిజంకాదా.. అని ప్రశ్నించారు. రైతుబంధు సక్రమంగా ఇవ్వలేదని మంత్రి తుమ్మల అబద్దాలు మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. ఆయన స్వగ్రామం గండుగులపల్లిలోని రైతులందరికీ రైతుబంధు వచ్చిందా లేదా అనే దానిపై చర్చకు సిద్ధమా అన్నారు. తుమ్మల మంత్రిగా ఉన్న సమయంలోనే రాష్ట్రంలోని రైతులకు రూ.72 వేల కోట్లు రైతుబంధు రూపంలో రైతుల ఖాతాల్లో వేసింది నిజంకాదా అన్నారు.
జిల్లాలో 2014కు ముందు పామాయిల్ సాగుపై రైతులకు అవగాహన లేదని.. బీఆర్ఎస్ మంత్రివర్గంలో తుమ్మల మంత్రిగా ఉన్నప్పుడే ఖమ్మంజిల్లా పామాయిల్ హబ్గా మారిందన్నారు. అంతేకాదు గతంలో తుమ్మల వరి మాత్రమే సాగు చేసేవారని.. ఇప్పుడు మొత్తం పామాయిల్ సాగు చేస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యవసాయానికి విద్యుత్ సరఫరా ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా ఉన్నది అనేది రైతులను అడిగితే వారే చెబుతారని అన్నారు.
వరి ధాన్యానికి బోనస్ ఇస్తామని గత ప్రభుత్వం ఏనాడూ ప్రకటించలేదని.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించి ఇప్పుడేమో నాలుక మడతేసినట్లు ఎద్దేవా చేశారు. రెండ్రోజుల క్రితం జరిగిన క్యాబినెట్ మీటింగ్ అనంతరం కేవలం సన్నవడ్లకే రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించారన్నారు. ముఖ్యమంత్రి ఓ తీరు.. వ్యవసాయ మంత్రి మరో తీరు.. పౌరసరఫరాలశాఖ మంత్రి ఇంకో రీతిన మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల్లో భాగంగా రైతులకు వరికి రూ.500 బోనస్ ఇచ్చేంత వరకు కచ్చితంగా కొట్లాడుతామని హెచ్చరించారు. హరీశ్రావుపై చేసిన ఆరోపణలపై తాము చర్చకు సిద్ధమని, మీరు సిద్ధమా అని తుమ్మలకు సవాలు విసిరారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి గెలుపుతోనే పట్టభద్రులకు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పేర్కొన్నారు. ఓ న్యూస్ చానల్ను ఏర్పాటు చేసి వేలాదిమందిని బ్లాక్మెయిల్ చేసి మోసాలకు పాల్పడిన బ్లాక్ మెయిలర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అని అన్నారు. ఈ విషయాన్ని ఆయన న్యూస్ చానల్లోనే పనిచేసిన తోటి సహచరులే బాధితులుగా బయటికి వచ్చి పేర్కొన్నారని గుర్తుచేశారు.
శాసనమండలికి పంపే వ్యక్తి గౌరవప్రదంగా ఉండేలా చూసుకోవాలని పట్టభద్రులకు సూచించారు. గత రెండు వారాలుగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రాకేశ్రెడ్డి గెలుపు కోసం క్షేత్రస్థాయిలో విజయవంతంగా ప్రచారం చేస్తున్నారని అభినందించారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, తాళ్లూరి జీవన్కుమార్, షేక్ తాజుద్దీన్, పట్టభద్రుల ఎమ్మెల్సీ మధిర నియోజకవర్గ ఇన్చార్జి బిచ్చాల తిరుమలరావు, ఖమ్మంరూరల్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.