మామిళ్లగూడెం, ఫిబ్రవరి 27: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై సమీక్షించనున్న దిశ కమిటీ సమావేశానికి తమను పిలవకుండా, ప్రొటోకాల్ పాటించడంలో జిల్లా అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో దిశ కమిటీ సమావేశం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మధు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న తమను ఉద్దేశపూర్వకంగానే అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సూచనల మేరకు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలుపంచుకోనీయకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా నుంచి ఎన్నికైన బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులకు, ఎమ్మెల్సీలకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. దీనిపై మండలిలో నిలదీస్తానని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
ప్రతి ఆరు నెలలకోసారి కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై కీలకంగా చర్చించే దిశ సమావేశానికి సమాచారం ఇవ్వకుండా.. ప్రజల తరఫున పోరాటం చేసే తమ గొంతు నొక్కాలని ప్రయత్నిస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు ప్రజాప్రతినిధులను ఆహ్వానించడానికి నిబంధనలు ఉన్నాయా అని ప్రశ్నించారు. వెంటనే జిల్లా అధికారులు చేసిన తప్పిదాన్ని ఒప్పుకొని క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
అయితే సమావేశం ప్రారంభమైన వెంటనే నల్ల కండువాతో లోపలికి వచ్చిన ఎమ్మెల్సీ మధు వేదిక మీదనే అధికారుల తీరుపై ధ్వజమెత్తారు. ఒక ప్రజాప్రతినిధిని అవమానిస్తున్నారని, రాజ్యాంగ పదవులలో కొనసాగుతున్న వారిని నిలువరిస్తే ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో ఎంపీ రఘురాంరెడ్డి, కలెక్టర్ అనుదీప్, ఇతర ప్రజాప్రతినిధులు కలుగచేసుకుని సముదాయించారు. అనంతరం సమావేశం ముగిసే వరకు నల్ల కండువాతోనే నిరసన వ్యక్తం చేస్తూ కూర్చున్నారు.