ఖమ్మం, మే 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కార్యకర్తలే బీఆర్ఎస్కు శ్రీరామరక్ష అని ఆ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు పేర్కొన్నారు. వారి పోరాట పటిమ వల్లే పార్టీ తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చిందని, అనేక విజయాలు సాధించిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు అంశంపై పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి అధ్యక్షతన ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో గురువారం జరిగిన పాలేరు నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుల సమావేశంలో రవీందర్రావు మాట్లాడారు. రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక చర్యల వల్ల అన్ని వర్గాల ప్రజలు విసుగుచెంది ఉన్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేళ్లలో ప్రజా సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేశారని గుర్తుచేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పాటుపడిందని జ్ఞప్తికి తెచ్చారు. ఆ విజయాలను క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి రాకముందు రేవంత్రెడ్డి అలవిగాని హామీలిచ్చారని, ఆచరణ సాధ్యంకాని విషయాలను పదేపదే చెప్పి ప్రజలను మోసం చేశారని గుర్తుచేశారు. ఈ మోసాన్ని ప్రజలు ఇప్పటికే గ్రహించారని అన్నారు. ఇలాంటి మోసాలపై వారికి మరింత వివరంగా చెప్పాల్సిన అవసరం పార్టీ కార్యకర్తలపైనే ఉందని అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. అన్ని రంగాల్లోనూ విఫలమైందని విమర్శించారు. రేవంత్రెడ్డి అధికారంలోకి రాకముందు అబద్ధ్దాలను పదేపదే చెప్పడం ద్వారా అవి నిజమేనని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారని, రాష్ట్ర ప్రజలను నిలువునా ముంచారని దుయ్యబట్టారు.
కార్యకర్తల చేతిలో బీఆర్ఎస్ ఉందని, నిరంతరం శ్రమించే కార్యకర్తలే పార్టీకి గుండెకాయలాంటి వారని అన్నారు. సభ్యత్వ నమోదును ఈసారి ప్రతి గ్రామంలోనూ చేయాలని, డిజిటల్ పద్ధతిలో ఈ నమోదు ఉందని అన్నారు. ప్రతి బూత్కూ ఇద్దరు కార్యకర్తలను నియమించి సభ్యత్వ నమోదును నిర్వహించాలని సూచించారు. సభ్యత్వ నమోదు పారదర్శకంగా ఉండాలని ఆదేశించారు. పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్కు, కేసీఆర్కు బ్రహ్మరథం పట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. పార్టీ నాయకులు బెల్లం వేణుగోపాల్, ఉన్నం బ్రహ్మయ్య, ఇంటూరు శేఖర్, ఆర్మీ రవి తదితరులు పాల్గొన్నారు.