కొత్తగూడెం అర్బన్, సెప్టెంబర్ 14 : పట్టణాభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం అందుకు తగినట్లుగా నిధులు విడుదల చేస్తోంది. రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీని ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ అవసరమైన నిధులను ఎప్పటికప్పుడు కేటాయిస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో వార్డుల్లో ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేపట్టి స్థానిక ఎమ్మెల్యేలే అభివృద్ధికి బాటలు వేయాలని ఆదేశించారు. పట్టణాభివృద్ధి పనులకు సంబంధించి రూ.115కోట్ల నిధులను ఇటీవలే ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
కొత్తగూడెం పట్టణానికి ఇప్పటికే రూ.వందల కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఇటీవల సీఎం కేసీఆర్ కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన సందర్భగా అదనంగా కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలకు చెరో రూ.వంద కోట్ల నిధులను మంజూరు చేస్తానని చెప్పిన హామీని నిలబెట్టుకున్నారు. ప్రస్తుతం కొత్తగూడెం పట్టణానికి రూ.115కోట్ల(డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ రూ.75కోట్లు, ప్రత్యేక అభివృద్ధి నిధులు రూ.40కోట్లు)తో ప్రతి వార్డులో అవసరమైన పనులు చేపట్టేందుకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు శ్రీకారం చుట్టారు. వార్డుల్లో అభివృద్ధి పనులను చేపట్టడంతోపాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని సీఎం ఆదేశించడంతో ఆ దిశగా నిధులను అధికారులు వినియోగిస్తున్నారు. ప్రతి వార్డుకు ఒక కమ్యూనిటీ హాల్, పార్కుల అభివృద్ధి, అంగన్వాడీ భవన నిర్మాణం, సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, క్రీడా మైదానాలు, స్వయం సహాయక సంఘాలకు పక్కా భవనం, వీధి దీపాలు, సెంట్రల్ లైటింగ్, బస్ షెల్టర్, ఫుట్పాత్ల నిర్మాణం తదితర పనులు చేపడుతున్నారు.
కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 36 వార్డులు ఉన్నాయి. కొన్ని వార్డుల్లో కమ్యూనిటీ హాళ్లు ఉన్నాయి. అయితే లేని చోట ఈ నిధులతో నిర్మాణాలు చేపట్టాలని తీర్మానించారు. కమ్యూనిటీ హాల్ కోసం రూ.50లక్షల చొప్పున కేటాయించారు. దీంతో వార్డుకో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టనున్నారు. అంతేకాక నిధుల కొరతతో నిలిచిపోయిన నిర్మాణాలను సైతం ఈ నిధులతో చేపట్టనున్నారు. స్వయం సహాయక సంఘాల సమావేశాలు, స్థానిక ప్రజలు సమావేశాలు, వివాహాది శుభకార్యాలు చేసుకునే విధంగా అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించి నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇక వార్డుల్లో చిల్ట్రన్స్ పార్కులు, అవసరమైన చోట ఓపెన్ జిమ్లు సైతం ఏర్పాటు చేయనున్నారు. ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహించేందుకు, క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు నిత్యం ప్రాక్టీస్ చేసుకునే విధంగా ప్రగతి మైదాన్లో ట్రాక్, ఇండోర్ స్టేడియం నిర్మాణానికి రూ.కోటి, రామవరంలోని సాధన గ్రౌండ్లో మౌలిక వసతులు కల్పించేందుకు రూ.50లక్షలు, అత్యాధునిక ధోబీఘాట్ నిర్మాణానికి రూ.కోటి నిధులను ప్రత్యేకంగా కేటాయించారు.
తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన రూ.115కోట్ల నిధులతో చేపట్టనున్న పనులకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు శంకుస్థాపన చేయగా.. ఆయా ప్రాంతాల్లో పనులు సైతం ప్రారంభమయ్యాయి. నాణ్యతలో రాజీ లేకుండా.. పది కాలాల పాటు మన్నికగా ఉండేలా పనులు చేపట్టాలని ఎమ్మెల్యే పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లను ఆదేశించారు. పనుల్లో నాణ్యత లేని పక్షంలో అవసరమైతే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో సైతం పెట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తమ ప్రాంతాల్లో చేపట్టిన పనులను ప్రజలు కూడా పర్యవేక్షించి.. లోపాలున్నైట్లెతే అధికారులకు లేదా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
కొత్తగూడెం పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు తనవంతు కృషి చేస్తున్నా. సీఎం కేసీఆర్ అడిగిన వెంటనే కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల అభివృద్ధికి చెరో రూ.వంద కోట్ల నిధులను కేటాయించారు. ఈ నిధులతో పట్టణాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం. ప్రతి వార్డుకు సీసీ రోడ్డు, డ్రైన్లు, కమ్యూనిటీ హాళ్లు, పార్కులు, ఓపెన్జిమ్లు ఏర్పాటు చేస్తున్నాం. సీఎం కేసీఆర్ రాజీపడకుండా విడుదల చేసిన నిధులతో అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కిస్తాను. -వనమా వెంకటేశ్వరరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే