భద్రాద్రి కొత్తగూడెం, మే 30 (నమస్తే తెలంగాణ) : వచ్చేనెల చివరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పోడు పట్టాలు పంపిణీ చేయిస్తామని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మొత్తం 51 వేల మందికి పోడు పట్టాలను పంపిణీ చేయాల్సి ఉండగా నియోజకవర్గంలో 5 వేల మందికి పోడు పట్టాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతిష్ఠాత్మకంగా జరిగే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో ప్రతిఒక్కరూ పాల్గొని, పండుగలా జరుపుకోవాలని ఆయన అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉత్సవాల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలందరికీ అర్థమయ్యేలా వివరించాలన్నారు.
అభివృద్ధిలో మనకు ఎవరూ సాటిరారని, తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్గా అభివృద్ధి చెందిందన్నారు. కొత్తగూడెంలో జరిగిన అభివృద్ధిని చూసి ఈ ప్రాంతానికి వచ్చే కొత్తవారు ఆశ్చర్యపోతున్నారని, సీఎం కేసీఆర్ సహకారంతో జంటనగరాలకు దీటుగా పాల్వంచ, కొత్తగూడెం పట్టణాలను అభివృద్ధి చేస్తానన్నారు. సమావేశంలో వనమా రాఘవేందర్రావు, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావు, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మీ, ఎంఏ రజాక్, కాసుల వెంకట్, బీమా శ్రీధర్, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, ఏఎంసీ చైర్మన్ భూక్యా రాంబాబు, ఎంపీపీలు బదావత్ శాంతి, భూక్యా సోనా, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, కో ఆప్షన్ మెంబర్లు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, డై రెక్టర్లు, మండల అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వర్లు, ఉమర్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.