సత్తుపల్లి, జూలై 16 : ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇచ్చే బీఆర్ఎస్ పార్టీ కావాలా… మూడు గంటల విద్యుత్ ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కావాలా ఆలోచించుకో రైతన్నా… అని వినూత్న రీతిలో ముద్రించిన పోస్టర్లను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆవిష్కరించారు. ప్రజాక్షేత్రంలో పదిరోజులపాటు కాంగ్రెస్ తీరును ఎండగట్టాలని రైతన్నలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేయనున్న ఫ్లెక్సీలు, పోస్టర్లను ఆయన ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చాక రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులకు ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా అందిస్తూ తెలంగాణలో వ్యవసాయాన్ని పండుగ చేసి దేశానికే ఆదర్శంగా రాష్ర్టాన్ని కేసీఆర్ నిలుపుతుంటే చూసి తట్టుకోలేని కాంగ్రెస్ నాయకులు రైతులపై విషం చిమ్ముతున్నారని అన్నారు. 24 గంటల కరెంటు అవసరం లేదు… మూడు గంటలు ఇస్తేచాలంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రైతులపై విషం చిమ్ముతున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ పాలనలో రైతులు విద్యుత్ లేక రాత్రివేళల్లో మోటార్లు వద్ద పడిగాపులు కాసి పాము, పురుగుకాటుకు మృతిచెందిన ఘటనలు ఎన్నో ఉన్నాయని, విత్తనాలు, ఎరువుల కోసం క్యూలో నిల్చుని లాఠీదెబ్బలు తిన్న సంఘటనలు ఇప్పటికీ రైతులు మరువలేదన్నారు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో రైతులు సంతోషంగా ఎలాంటి భయం లేకుండా 24గంటల ఉచిత విద్యుత్తో రెండు పంటలు పుష్కలంగా పండించుకుంటుంటే ఓర్చుకోలేని కాంగ్రెస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. రైతులు కూడా గ్రామగ్రామాన చర్చ జరిపి ఆలోచించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తిరిగి పదేళ్లు రాష్ట్రం వెనక్కుపోతుందని, అల్లకల్లోలంగా మారి రాష్ట్రం అంధకారమయవుతుందని గుర్తుచేశారు. ఈ పదిరోజుల పాటు గ్రామగ్రామాన ఉచిత విద్యుత్పై చర్చ జరగాలని, రైతులు ఒకసారి పూర్తిస్థాయిలో ఆలోచించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, ఆత్మ చైర్మన్ వనమా వాసు, డీసీసీబీ డైరెక్టర్లు చల్లగుళ్ల కృష్ణయ్య, మోదుగు పుల్లారావు, షేక్ రఫీ, అంకమరాజు, పెనుబల్లి, వేంసూరు ఎంపీపీ లక్కినేని అలేఖ్య, పగుట్ల వెంకటేశ్వరరావు, కొడిమెల అప్పారావు, మోరంపూడి ప్రసాద్, శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, వల్లభనేని పవన్, అద్దంకి అనిల్ తదితరులు పాల్గొన్నారు.