సత్తుపల్లి టౌన్, అక్టోబర్ 8 : అధికారంలో 55ఏండ్లపాటు ఉన్న కాంగ్రెస్ పార్టీ దేశానికి, రాష్ర్టానికి చేసిందేమీలేదని, తొమ్మిదిన్నరేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ర్టాన్ని ఎంతో అభివృద్ధి చేశారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం సత్తుపల్లి మండలంలోని కిష్టాపురం, బేతుపల్లి, తాళ్లమడ, కిష్టారం, చెరుకుపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా బేతుపల్లి బహిరంగ సభలో ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్వన్ స్థానంలో ఉంచారన్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఆరు గ్యారంటీలు అంటూ సీఎం కేసీఆర్ మదిలో నుంచి వచ్చిన పథకాలకు పేరుమార్చి పథకాలు అందిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. దేశంలో ఇప్పటివరకు పాలించిన కాంగ్రెస్ రైతులకు రైతుబంధు ఇచ్చిందా అని ప్రశ్నించారు.
అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడుతున్న కేసీఆర్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. కిష్టాపురంలో 30 కుటుంబాలకు గృహలక్ష్మి ఇండ్ల పట్టాలను ఇంటింటికీ వెళ్లి సండ్ర స్వయంగా అందించారు. బేతుపల్లిలో సీసీ రోడ్లకు, బీటీ రోడ్లకు శంకుస్థాపనలు చేసి పల్లెదవాఖానా భవనాన్ని ప్రారంభించారు. తాళ్లమడలో సీసీ, బీటీ రోడ్లకు శంకుస్థాపన చేసి కిష్టారంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి, బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. గ్రామంలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని, సొసైటీ నూతన భవనానికి, పంచాయతీ నూతన భవనాన్ని సండ్ర ప్రారంభించారు. సీసీ రోడ్లకు శంకుస్థాపనలు చేశారు. మొత్తం రూ.11.50 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సండ్ర శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. బేతుపల్లి, కిష్టారం గ్రామాల్లో ఎమ్మెల్యే సండ్రకు గ్రామస్తులు, లబ్ధిదారులు బతుకమ్మలు, కోలాటాలతో పెద్దఎత్తున స్వాగతం పలికారు. సండ్ర గ్రామాల్లో ద్విచక్రవాహనంపై ప్రదర్శనగా వెళ్లి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డా హైమావతి, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, గంగారం సర్పంచ్ వాసురెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మాజీ ఆత్మ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు యాగంటి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు దొడ్డా శంకర్రావు, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.