వేంసూరు, జూలై 12: కాంగ్రెస్ వస్తే రైతులకు మళ్లీ చీకటి రోజులు తప్పవని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. అధికారంలోకి రాకముందే పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి బుద్ధి బయటపడిందని విమర్శించారు. వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అవసరం లేదని, మూడు గంటలే సరిపోతుందంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మండిపడ్డారు. బీఆర్ఎస్ పిలుపు మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లోనూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు కలిసి రేవంత్రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు. మర్లపాడు నుంచి వేంసూరు మండల పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో తీవ్ర ఇబ్బందులకు గురైన రైతులు నేడు కేసీఆర్ పాలనలో వ్యవసాయాన్ని పండుగలా చేసుకొని ఆనందంగా ఉంటున్నారని అన్నారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పగుట్ల వెంకటేశ్వరరావు, పల్లా వెంకటరెడ్డి, కంటే వెంకటేవ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
సత్తుపల్లి, జూలై 12: తెలంగాణ ఆయిల్పాం అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను నియమిస్తూ రాష్ట్ర ఉద్యానవన శాఖ డైరెక్టర్ హనుమంతరావు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. మొత్తం కమిటీలో 22 మంది సభ్యులకు గాను వ్యవసాయశాఖ మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలు ఉంటారు. ఆ ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒకరిగా సండ్రను నియమించారు.