‘మైనార్టీలను అన్ని విధాలా ఆదుకుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి మైనార్టీ ప్రజలు అండగా నిలవాలి. ఉమ్మడి జిల్లాలోని పది స్థానాల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి. తెలంగాణ సిద్ధించిన తర్వాత మైనార్టీల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.10,600 కోట్లు వెచ్చించింది. ఇందులో షాదీముబారక్ ద్వారా 2.77 లక్షల మందికి రూ.2,300 కోట్ల సాయాన్ని అందించింది. కేసీఆర్ ప్రభుత్వంలోనే మైనార్టీలకు అనేక ప్రయోజనాలు చేకూరాయి’ అని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. గురువారం బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ గెలుపును కాంక్షిస్తూ నగరంలో ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి రోడ్షో నిర్వహించారు. తొలుత బీఆర్ఎస్ జిల్లా కార్యాలయమైన తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఖమ్మం, నవంబర్ 16: కేసీఆర్ ప్రభుత్వంలోనే మైనార్టీలకు అనేక ప్రయోజనాలు చేకూరాయని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ఎంతో మేలు కలిగిందని అన్నారు. తెలంగాణ వచ్చాక మైనార్టీల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.10,600 కోట్లు వెచ్చించిందని వివరించారు. మైనార్టీలను అన్ని విధాలా ఆదుకుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి మైనార్టీ ప్రజలు కూడా అండగా ఉండాలని, ఉమ్మడి జిల్లాలోని పది స్థానాల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఖమ్మంలో గురువారం పర్యటించిన ఆయన.. బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ గెలుపును కాంక్షిస్తూ నగరంలో రోడ్షో నిర్వహించారు. తొలుత బీఆర్ఎస్ జిల్లా కార్యాలయమైన తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పూర్తి ఆర్ఎస్ఎస్ భావజాలమున్న పీసీసీ చీఫ్ రేవంత్కు తెలంగాణ ప్రజలు బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు.
తమ పార్టీ సీఎం అభ్యర్థి కేసీఆరేనని స్పష్టం చేశారు. కానీ ఇప్పటికీ ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పలేని దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని విమర్శించారు. కాంగ్రెస్లో 20 మంది సీఎం అభ్యర్థులున్నారంటూ ఆ పార్టీ నేతలే చెప్పుకుంటుండడం సిగ్గుచేటని అన్నారు. కేసీఆర్ తెలంగాణ జాతిపిత అనే భావనతోనే తాను కరీంనగర్లో మాట్లాడాను తప్ప ముస్లిం మైనార్టీలను తప్పుపట్టలేదని అన్నారు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని అన్నారు. ఖమ్మం గతంలో ఎలా ఉండేదో, ఇప్పుడు ఎలా ఉందో ఇక్కడి ప్రజలు ఆలోచించాలని కోరారు. అజయ్కుమార్ చాలా మంచి వారని అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి ఆయనకు గెలిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆర్జేసీ కృష్ణ, కూరాకుల నాగభూషణం, పునుకొల్లు నీరజ, జహీర్ అలీ, ఖమర్, షౌకత్ అలీ, తాజుద్దీన్ పాల్గొన్నారు.
గత ప్రభుత్వాలు ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగానే చూశాయని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ విమర్శించారు. కానీ వారి అభ్యున్నతికి తోడ్పడింది మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ గెలుపును కాంక్షిస్తూ ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి ఖమ్మంలో గురువారం నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. ముస్లిం మైనార్టీలు అధిక సంఖ్యలో ఉన్న ఖమ్మంలో పువ్వాడకు ఓటు వేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సే అన్నారు. ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ ఖాయమన్నారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పునుకొల్లు నీరజ, కూరాకుల నాగభూషణం, జహీర్అలీ, మక్బుల్, షౌకత్ అలీ, ఖమర్, తాజుద్దీన్, షకీనా తదితరులు పాల్గొన్నారు.