భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ ములకలపల్లి/ వైరా టౌన్, ఆగస్టు 11 : సీతారామ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తిచేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు పూర్తిస్థాయిలో సాగునీళ్లు అందిస్తామని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. భూసేకరణ, డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పనులను యుద్ధప్రాతిపదికన చేపడతామన్నారు. ఇందుకోసం సీఎం రేవంత్రెడ్డి తరఫున తాను మాట ఇస్తున్నట్లు చెప్పారు. సీతారామ ప్రాజెక్టు పనులను తమ ప్రభుత్వం ప్రాధాన్య అంశంగా తీసుకుందని అన్నారు.
ఈ నెల15న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉమ్మడి జిల్లాలో పర్యటించి సీతారామ ప్రాజెక్టు రెండు, మూడు పంపుహౌస్లను ప్రారంభించనున్న నేపథ్యంలో మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో పర్యటించి సీతారామ ప్రాజెక్టు పనులను, సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించారు. తొలుత భద్రాద్రి జిల్లాలో పర్యటించిన మంత్రులు.. ములకలపల్లి మండలం పూసుగూడెం సమీపంలోని వీకే రామవరం వద్ద సీతారామ ప్రాజెక్టు రెండో పంపుహౌస్ ట్రయల్ రన్ను స్విచ్ ఆన్చేసి ప్రారంభించారు. అనంతరం కమలాపురం వద్ద మూడో పంపుహౌస్ను పరిశీలించారు.
ఈ సందర్భంగా అక్కడ జరిగిన అధికారుల సమావేశంలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. పూసుగూడెం వద్ద రెండో పంపుహౌస్ ట్రయల్ రన్ విజయవంతమైనట్లు చెప్పారు. అనంతరం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులకు ఉపయోగపడే సీతారామ ప్రాజెక్టు పనులను పనులు నత్తనడకన కొనసాగాయన్నారు. ఇక ముందు ఉమ్మడి జిల్లా ఆయకట్టుకు కృష్ణా జలాలు సకాలంలో రాకపోతే ప్రత్యామ్నాయంగా తక్కువ ఖర్చుతో వైరా లింక్ కెనాల్ ద్వారా గోదావరి నీళ్లను అందిస్తామని వివరించారు. జూలూరుపాడు టన్నెల్ పనులు పూర్తయితే పాలేరు వరకు గోదావరి జలాలు చేరుతాయన్నారు.
అనంతరం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. సీతారామ ప్రాజెక్టుతో ఉమ్మడి జిల్లా రైతుల చిరకాల కోరిక నెరవేరిందని అన్నారు. అయితే ఉమ్మడి జిల్లాలో భద్రాచలం, ఇల్లెందు మినహ మిగతా ఎనిమిది నియోజకవర్గాలకూ సీతారామ ప్రాజెక్టు నీళ్లు అందుతాయని వివరించారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ప్రభుత్వ ముఖ్య సలహదారుడు పెంటారెడ్డి, ఎస్పీ రోహిత్రాజ్, నీటిపారుదలశాఖ సెక్రటరీ రాహుల్బొజ్జా, స్పెసల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్కుమార్, నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్బాబు, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఈ నెల 15న సీఎం రేవంత్రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నట్లు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. ఆ రోజున ములకలపల్లి మండలంలో సీతారామ ప్రాజెక్టు రెండు, మూడు పంపుహౌస్ల ప్రారంభిస్తామని, వైరా మండలంలో రుణమాఫీ రైతుసదస్సులో ప్రసంగిస్తారని తెలిపారు. ఈ మేరకు వైరాలోని రైతు సదస్సు వద్ద జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీతారామ ప్రాజెక్ట్ నిర్మాణంతో ఉమ్మడి జిల్లా ప్రజలు, రైతుల చిరకాల వాంఛ నెరవేరుతోందని అన్నారు.
గోదావరి జలాలు సాగర్ ఆయకట్టుకు చేరనున్నాయని అన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు చివరి భూములకు సాగర్ నీళ్లు రాని సమయంలో సీతారామ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలను తీసుకొని వచ్చి ఏన్కూరు ఎన్ఎస్పీకి అనుసంధానం చేసి 1.70 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, అధికారులు పాల్గొన్నారు.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సోమవారం భద్రాద్రి జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి డిప్యూటీ సీఎం జిల్లాలో పర్యటించనున్న సందర్భంగా సోమవారం ప్రజావాణి రద్దు చేసినట్లు కలెక్టర్ జితేశ్ తెలిపారు.