వినాయక్నగర్, ఆగస్టు 4 : ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తప్పవని సీపీ సాయిచైతన్య హెచ్చరించారు. మంగళవారం ఆయన కమిషనరేట్లో సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎంఆర్ రైస్ మిల్లుల్లో నమోదైన కేసులపై చర్చించారు. రైస్మిల్లుల్లో చోటు చేసుకున్న అవకతవకల నేపథ్యంలో ఇప్పటివరకు నమోదైన కేసుల పురోగతిపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా నమోదైన కేసుల దర్యాప్తు పురోగతి, స్వాధీనం చేసుకున్న ధాన్యం, బియ్యం, సంబంధిత రికార్డుల పరిశీలన, నిందితులపై తీసుకుంటున్న చట్టపరమైన చర్యలు, మిగిలిన కేసుల విచారణ వేగవంతం చేయడం తదితర అంశాలపై చర్చించారు. రైస్ మిల్లర్లు పారదర్శకత పాటించాలని సూచించారు. సమావేశంలో అదనపు డీసీపీ శుభం ప్రకాశ్, సివిల్ సప్లయ్ అధికారి శ్రీకాంత్రెడ్డి, శ్రీధర్రెడ్డి, మల్లేశ్, అంజయ్య, ప్రవీణ్, అరవింద్రెడ్డి, దయానంద్గుప్తా, మోహన్రెడ్డి పాల్గొన్నారు.