మామిళ్లగూడెం, మార్చి 5 : తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మారెటింగ్, జౌళి, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ వీపీ గౌతమ్తో కలిసి జిల్లాలో నీటి ఎద్దడి నివారణకు చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై రెవెన్యూ, ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్, మిషన్ భగీరథ, పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని పాలేరు, వైరా, లకారం, లంకపల్లి జలాశయాల్లో నీటి లభ్యత, వచ్చే నాలుగు నెలలకు కావాల్సిన అవసరాలపై ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.
బేతుపల్లి, బోడేపూడి సుజలాం సఫలం, భగీరథ ఎన్ఎస్పీ ద్వారా నీటిని సమకూర్చుకుంటే భూగర్భ జలాలు పెరగడంతోపాటు బోర్లు, బావుల్లో గ్రావిటీ పెరుగుతుందని, దీంతో నీటి కొరతను అధిగమించవచ్చన్నారు. కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ మంత్రి సూచన ప్రకారం నీటి ఎద్దడి నివారణకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, తాగునీటి లభ్యత, వినియోగంపై సమీక్షా సమావేశాలు నిర్వహించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జలాశయాలతోపాటు గ్రామాల్లో ఉన్న బోర్లను పునరుద్ధరించామన్నారు. సమావేశంలో సీపీ సునీల్ దత్, అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, శిక్షణ కలెక్టర్లు మయాంక్ సింగ్, యువరాజ్, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సురేందర్, ఇరిగేషన్ ఎస్ఈ ఆనంద్కుమార్, మిషన్ భగీరథ ఎస్ఈ సదాశివకుమార్, భగీరథ ఇంట్రా ఈఈ పుష్పలత, గ్రిడ్ ఈఈ వాణిశ్రీ, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్కుమార్, మున్సిపల్ ఈఈ కృష్ణలాల్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.