ఖమ్మం, జూన్ 30: ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి 100 సీట్లతో తరగతుల నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అధికారులను ఆదేశించారు. జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం ఖమ్మం చేరుకున్న ఆయన.. ఇక్కడి పాత కలెక్టరేట్ భవనంలోని ప్రభుత్వ వైద్య కళాశాలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో కలిసి పరిశీలించారు. కొనసాగుతున్న ఆధునీకరణ పనులను పరిశీలించి వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. అనుకున్న సమయానికి పనులన్నీ పూర్తి చేసి సకాలంలో తరగతులు నిర్వహించేందుకు సిద్ధం చేయాలని కలెక్టర్ను, అధికారులను ఆదేశించారు. పాత కలెక్టరేట్ భవనం 5 ఎకరాలు, రోడ్లు, భవనాల శాఖ కార్యాలయం 3 ఎకరాలు కలిపి మొత్తం 8 ఎకరాల విశాల ప్రాంగణంలో కళాశాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు నిర్వహించేలా చర్యలు చేపట్టామన్నారు. మంత్రి అజయ్కుమార్ మాట్లాడుతూ.. పనులన్నీ పూర్తి చేసి అనుకున్న సమాయానికి ప్రారంభించుకునేలా కళాశాలను సిద్ధం చేయాలని సూచించారు. కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో 2023-24 విద్యా సంవత్సరం నుంచి నేషనల్ మెడికల్ కమిషన్ చట్టం ప్రకారం అనుమతి లభించిన దరిమిలా తరగతుల నిర్వహణకు అంతా సిద్ధంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలకు కేటాయించిన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో మంత్రులు గ్రూప్ ఫోటో దిగారు. ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు, ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, వైరా ఎమ్మెల్యే రాములునాయక్, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, ఐటీడీఏ పీవో గౌతమ్ పొట్రు, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, కార్పొరేటర్ కర్నాటి కృష్ణ, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరరావు, జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.