ఖమ్మం : యావత్ దేశాన్నే వణికిస్తున్న కరోనా మహమ్మారి నివారణ చర్యలకై అందిస్తున్న కోవిడ్ వాక్సినేషన్ మొదటి డోస్ ఖమ్మం జిల్లాలోవంద శాతం పూర్తి చేసిన జిల్లా యంత్రాంగాన్ని వైద్య సిబ్బందిని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభినందించారు. జిల్లాలో 100శాతంవాక్సినేషన్ మొదటి డోస్ పూర్తి స్థాయిలో అందించిన సందర్భంగా నిర్వహించిన అభినందన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.
మొదటి డోస్ వ్యాక్సినేషన్ ను విజయవంతంగా పూర్తి చేయడానికి గ్రామ స్థాయి నుంచి నగరాల వరకు పని చేసిన సంబంధిత శాఖల అధికారులకు, సిబ్బంది అంకిత భావంతో పని చేశారని.. వారి సహకారంతోనే వ్యాక్సినేషన్ కార్యక్రమం ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా పూర్తి చేశారని, ఇందులో పాలుపంచుకున్న వారికి మంత్రి అభినందనలు తెలిపారు. 100శాతం వాక్సిన్ పూర్తి చేసిన సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన సిబ్బందిని శాలువతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, మేయర్ పునుకొల్లు నీరజ, సూడా చైర్మన్ విజయ్, జిల్లా కలెక్టర్ గౌతమ్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ మధుసూదన్,డీఎం అండ్ హెచ్ ఓ మాలతి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.