రఘునాథపాలెం : నిరుపేద తల్లిదండ్రులకు ఆడబిడ్డ పెళ్లి భారం కాకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణలక్ష్మి, షాదీముభారక్ పథకాలకు శ్రీకారం చుట్టారని రాష్ట్ర రవాణాశాఖామంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. మంగళవారం ఖమ్మం అర్బన్ పరిధిలోని పలు డివిజన్లలో ఆయా పథకాల కింద మంజూరైన చెక్కులను మంత్రి లబ్ధిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి అందజేశారు.
మంత్రి మాట్లాడుతూ..కళ్యాణలక్ష్మీ, షాదీముభారక్ పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. చెక్కుల పంపిణీ సమయంలో నిరుపేద తల్లిదండ్రుల ముఖాల్లో ఆనందాన్ని చూస్తున్నామన్నారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి అండగా నిలవాలనే ఆలోచన గతంలో ఏ ప్రభుత్వం చేయలేదన్నారు. సీఎం కేసీఆర్ మస్థిష్కంలో నుంచి ఉద్బవించిన ఈ పథకాలను పలురాష్ట్రాలు ఆదర్శంగా తీసుకొని అమలు చేస్తున్నాయన్నారు.
యూపీ, ఒడిస్సా రాష్ట్రాలు పేర్లు మార్చి పేదింటి ఆడబిడ్డలకు ఆర్ధిక సాయాన్ని అందజేస్తున్నాయన్నారు. విజన్ ఉన్న మహానేత సీఎం కేసీఆర్ అని ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ పునకొల్లు నీరజ, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు దండా జ్యోతిరెడ్డి, నాగండ్ల కోటి, షేక్ జాన్బీ, రావూరి కరుణ, నాయకులు వంటికొమ్ము శ్రీనివాస్రెడ్డి, షేక్ వలీ తదితరులు పాల్గొన్నారు.