ఖమ్మం, నవంబర్ 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి) :ఖమ్మం నియోజకవర్గంలో అభివృద్ధి చేసిందెవరో ఇక్కడి ప్రజలకు తెలుసునని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. అదే సమయంలో అరాచకం సృష్టించిందెవరో ఈ నియోజకవర్గ ప్రజలకు ఇంకా బాగా తెలుసునని అన్నారు. కాంగ్రెస్గానీ, ఆ పార్టీ అభ్యర్థి తుమ్మల గానీ చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పుకోలేకనే చిల్లర రాజకీయాలకు తెరలేపుతూ పసలేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అయినా ఈ ఆరోపణలన్నింటినీ తాము ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో ప్రజలే తీర్పు చెప్తారని అన్నారు. ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొనేందుకు సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం ఖమ్మం వస్తున్న నేపథ్యంలో సభ ఏర్పాట్లు, నియోజకవర్గ అభివృద్ధి వంటి అంశాలపై మంత్రి అజయ్కుమార్ శనివారం ‘నమస్తే తెలంగాణ ప్రతినిధి’తో మాట్లాడారు. ప్రజల ఆశీర్వాదంతో ఖమ్మం శాసనసభ్యుడిగా గత రెండు పర్యాయాలు తాను గెలుపొందానని అన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల వరకు బీఆర్ఎస్లోనే కొనసాగారని, ఈ ఆరోపణలపై బీఆర్ఎస్ అధినేతకు గానీ, లేదా ఇతర వ్యవస్థలకు అప్పుడే ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. అప్పుడు కనబడని అవినీతి, అక్రమాలు ఇప్పుడెలా కనబడుతున్నాయని ప్రశ్నించారు.
ఇది రాజకీయ దురుద్దేశం తప్ప మరేమీ కాదని అన్నారు. బీఆర్ఎస్ను ఎదుర్కోలేకనే వితండవాదాలను ప్రచారం చేస్తున్నారని అన్నారు. అయినా ఈ విషయాలన్నీ ఖమ్మం ప్రజలకు అర్థమయ్యాయని అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో ఖమ్మం నియోజకవర్గంలో రూ.వేల కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేశామని వివరించారు. ఆ అభివృద్ధి పనులే ఈ ఎన్నికల్లో తమకు శ్రీరామరక్షగా నిలుస్తాయని అన్నారు. ప్రజల కోసం పనిచేసే వారెవరో, ఎన్నికల కోసమే వచ్చేవారెవరో నియోజకవర్గ ప్రజలు గుర్తించారని అన్నారు. ఖమ్మం ప్రజలు చైతన్యవంతులని, అబద్ధపు ప్రచారాలతో వారిని మభ్యపెట్టలేరని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఖమ్మం ప్రజా ఆశీర్వాద సభకు ప్రజలు భారీగా తరలిరానున్నారని అన్నారు. ఇప్పటికే మూడు సభలు అద్భుతంగా విజయవంతమయ్యాయని గుర్తుచేశారు. ఆదివారం ఖమ్మం, కొత్తగూడెం జరిగే సభలు కూడా అదేస్థాయిలో విజయవంతమవుతాయని స్పష్టం చేశారు. ఖమ్మం నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున పోటీచేస్తున్న వ్యక్తి చేసిన అభివృద్ధి ఏమిటో, స్థానికుడినైన తాను చేసిన అభివృద్ధి ఏమిటో ఇక్కడి ప్రజలకు తెలుసునని అన్నారు. ఈ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గంతోపాటు ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్ అభ్యర్థులందరూ విజయదుందుభి మోగించనున్నారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మరోసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి రానుందని తేల్చిచెప్పారు.