భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 24,(నమస్తేతెలంగాణ): చరిత్రలో నిలిచి పోయేలా కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధికి ఒకేసారి రూ.215 కోట్లు నిధులు ఇచ్చారని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి అజయ్కుమార్ స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుతో కలిసి గురువారం శంకుస్థాపనలు చేశారు. కొత్తగూడెం వచ్చిన మంత్రి పువ్వాడకు చుంచుపల్లి నుంచి భారీ ర్యాలీ ద్వారా స్వాగతం పలికారు. రామవరంలో చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మితో పాటు నాయకులు,కౌన్సిలర్లు గజమాలతో సత్కరించా రు. అనంతరం రామవరంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఒక విజన్ ఉన్న నాయకుడు అని, అందుకే కొత్తగూ డెం, పాల్వంచ పట్టణాలకు భారీగా నిధులు ఇచ్చారని అన్నారు. ఎమ్మెల్యే వనమా దగ్గరుండి మరీ నిధులు తెప్పించుకున్నారని, ముర్రేడు వాగుకు రిటైనింగ్ వాల్కు రూ.36 కోట్లు మంజూరు చేయించుకున్నారన్నారు.
ఖమ్మం కంటే ముందుగానే కొత్తగూడేనికి మెడికల్ కాలేజీ ఇచ్చారని, జిల్లా ఆసుపత్రిని ఏర్పాటు చేయడంతోపాటు రామవరంలో మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పా టు చేశారని గుర్తు చేశారు. ఈసారి భారీ మెజార్టీతో ఎమ్మెల్యే వనమాను గెలిపించాలన్నారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాపై నమ్మకంతో మళ్లీ తనకే టికెట్ ఇచ్చారని, ఆయన రుణం తీర్చుకుంటానన్నారు. పాల్వంచ, కొత్తగూడెం పట్టణాలను అభివృద్ధి చేయడమే ధ్యేయమన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా విజయం నావైపే ఉందన్నారు. ప్రతి ఇంటికీ వచ్చి కలుస్తానని, మీ సమస్యలకు తక్షణం పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. ఈ సభలో కలెక్టర్ ప్రియాంక అలా, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, గ్రంథాలయ చైర్మన్ దిండిగల రాజేందర్, మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మి, ఎంపీపీ శాంతి, మున్సిపల్ కమిషనర్ రఘు, వైస్ చైర్మన్ దామోదర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.