ఖమ్మం, జూన్ 21: మనిషి తన జీవిత పరమార్థాన్ని తెలుసుకోవడానికి ఆధ్మాత్మికతను మించిన మార్గం మరొకటి లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. దేశంలోకెల్లా అన్ని మతాలకూ సమ ప్రాధాన్యం ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనని స్పష్టం చేశారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా ఖమ్మంలో బుధవారం నిర్వహించిన ఆధ్యాత్మిక దినోత్సవానికి ఆయన హాజరయ్యారు. తొలుత స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్, వసంతలక్ష్మి దంపతులు, ఎమ్మెల్సీ తాతా మధు, కలెక్టర్ వీపీ గౌతమ్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రోటరీనగర్ గుడ్ షెఫర్డ్ చర్చి, తుమ్మలగడ్డ అస్టాబల్ మసీదులో ప్రత్యేక ప్రార్థనలు, నమాజులు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అన్ని మతాలకు సమాన గౌరవాన్నిస్తూ లౌకిక స్ఫూర్తిని ప్రదర్శిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. భిన్నత్వంలో ఏకత్వమే దేశానికి బలమని విశ్వసించే ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆధ్యాత్మిక క్షేత్రాల పురోగతికి చేయూతనిస్తున్నారని అన్నారు. తద్వారానే తెలంగాణలో ‘గంగా జమునా తెహజీబ్’ వర్థిల్లుతున్నదని అన్నారు.
ఖమ్మంలో బ్రాహ్మణ భవన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ 75 లక్షలను మంజూరు చేసిందన్నారు. మొహర్రం, పీర్ల పండుగలు కూడా తెలంగాణ సంసృతిలో భాగమయ్యాయన్నారు. ఏటా రంజాన్కు నియోజకవర్గ కేంద్రాల్లో దావత్ – ఇ – ఇఫ్తార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. పేద ముస్లింలకు రంజాన్ తోఫాతోపాటు షాదీముబారక్ పథకం ద్వారా ఆర్థిక చేయూతనిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని అన్నారు. క్రైస్తవులకు కూడా క్రిస్మస్ కానుకలను అధికారికంగా అందిస్తున్న అందస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు. నియోజకవర్గాల్లో ఒకో చర్చికి రూ.2 లక్షల చొప్పున నిధులు కేటాయించి క్రిస్మస్ విందులను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుండడం గొప్ప విషయమని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు పునుకొల్లు నీరజ, బచ్చు విజయ్కుమార్, పగడాల శ్రీవిద్య, బుర్రి వెంకట్కుమార్, దండా జ్యోతిరెడ్డి, దాదే అమృతమ్మ సతీశ్, మాడూరి ప్రసాద్, మక్బూల్, పగడాల నాగరాజు, షకీనా, గోలి వెంకటేశ్వర్లు (చిన్నా), జాన్ కాంతారావు, సత్యపాల్, జోజి, మెహమూద్, ఖమర్, షౌకత్ అలీ, మెహబూబ్ అలీ, ముఫ్తీ ఖలీక్, తాజుద్దీన్, ఎండీ గాయాజ్, షంశుద్దిన్, టిప్పు సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు.