ఖమ్మం, ఆగస్టు 11: పేదల కుటుంబాల్లో వెలుగులు నింపే పెద్దన్న సీఎం కేసీఆర్ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. కుమార్తెల వివాహాలు జరిపించేందుకు పేదలు అప్పులు చేసి ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదన్నదే ముఖ్యమంత్రి ధ్యేయమని స్పష్టం చేశారు. ఇందుకోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఖమ్మం నియోజకవర్గంలోని 101 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.1.01 కోట్ల విలువైన చెక్కులను ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో ఆలోచించి ప్రవేశపెట్టిన ఈ పథకాలే ఇప్పుడు పేదింటి ఆడపిల్లల కుటుంబాలకు కొండంత భరోసానిస్తున్నాయని అన్నారు. ఇప్పటికే ఇదే కార్యాలయంలో 300 మంది బీసీ వృత్తిదారులకు ఒక్కొకరికీ రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం చెక్కులు అందజేశామని, రానున్న నెల రోజుల్లో దళితులకు కూడా దళితబందు పథకం ద్వారా రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని పంపిణీ చేస్తామని అన్నారు. ఇప్పటి వరకు ఖమ్మం నియోజకవర్గంలో 8527 మందికి రూ.80.34 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెకులను అందజేసే అవకాశాన్ని సీఎం కేసీఆర్ కల్పించడం సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం లబ్ధిదారులకు ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమంలో మంత్రి పాల్గొని స్వయంగా లబ్ధిదారులకు వడ్డించారు.
ఇటీవల ఖమ్మం వచ్చిన ఒకాయన రూ.4000 పింఛన్ ఇస్తామంటూ ప్ల కార్డులు పట్టుకోవడం విడ్డూరంగా ఉందని మంత్రి అజయ్ విమర్శించారు. ఆయన పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు సామాజిక పింఛన్ రూ.200 మాత్రమే ఎందుకిచ్చారని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పునుకొల్లు నీరజ, విజయ్కుమార్, కూరాకుల నాగభూషణం, కొండబాల కోటేశ్వరరావు, పగడాల నాగరాజు, మందడపు నర్సింహారావు, కుర్రా భాస్కర్రావు, కర్నాటి కృష్ణ, రామ్మోహన్రావు, వలరాజు, అమృతమ్మ, కన్నం వైష్ణవి, తోట రామారావు, ఎర్రా అప్పారావు, ప్రసన్నకృష్ణ, మాటేటి కిరణ్కుమార్ పాల్గొన్నారు.
రఘునాథపాలెం, ఆగస్టు 11: వచ్చే ఎన్నికల్లో సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని మంత్రి అజయ్ స్పష్టం చేశారు. ఖమ్మం పాండురంగాపురం నుంచి బీఆర్ఎస్ 2వ డివిజన్ అధ్యక్షుడు నర్రా యల్లయ్య ఆధ్వర్యంలో పలు పార్టీలకు చెందిన 120 కుటుంబాల వారు శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు. పాండురంగాపురంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారందరికీ మంత్రి అజయ్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాత, కొత్త అనే తేడా లేకుండా అందరినీ కలుపుకొని వెళ్లాలని, పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. పునకొల్లు నీరజ, బచ్చు విజయ్కుమార్, కుర్రా మాధవరావు, చిలుమూరు కోటి, షేక్ రజీం, సీహెచ్వీ సుబ్బారావు, మోహన్రావు, కొణకంచి వరప్రసాద్, ఫయాజ్, మదార్, మల్లేశం, రాజు, ఉపేందర్ పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారిలో చందర్రావు, నాగయ్య, శివ, లింగయ్య, వెంకన్న, శంకరయ్య, ఉపేందర్, సైదులు, రాజు, నవీన్, శరణ్, వెంకటేశ్, నర్సమ్మ, పుల్లమ్మ, సమ్మయ్య, నాగమణి ఉన్నారు.