కూసుమంచి, సెప్టెంబర్ 24: నాగార్జున సాగర్ ఆయకట్టులోని ఖమ్మం జిల్లా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు సాగునీటిని విడుదల చేసింది. పాలేరు కాలువకు ఇటీవల గండి పడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన విషయం విదితమే. దీంతో పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు సోమవారం హైదరాబాద్లో ప్రెస్మీట్ పెట్టి సర్కారు నిర్లక్ష్యాన్ని ఎండగట్టిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే మంత్రి తుమ్మల స్పందించి కాలువను సందర్శించారు. పనులు వేగంగా చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో గండి కారణంగా నీళ్లు లీక్ అయిన ప్రాంతంలో సోమవారం నుంచే అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. ఎట్టకేలకు వాటిని పూర్తి చేసి మంగళవారం తెల్లవారుజాము నుంచి నీటిని విడుదల చేశారు.
కాగా, ఈ నీటి ప్రవాహాన్ని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం పరిశీలించారు. తదుపరి చర్యల గురించి ఇరిగేషన్ అధికారులతో చర్చించారు. యూటీని పూడ్చి వేయడంతో లభించిన సమస్య పరిష్కారం, జిల్లాకు పూర్తిగా సాగునీరు అందిచేందుకు తీసుకుంటున్న జాగ్రత్తలు తదితర అంశాల గురించి వారితో మాట్లాడారు. ఈ క్రమంలో ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో పలు ఆదేశాలు జారీ చేశారు. సాగర్ ఆయకట్టు ఖమ్మం జిల్లాలోని పంటలకు నీళ్లు అందని కారణంగా అవి ఎండుపోతున్నాయి. ఈ క్రమంలో ఇటీవలి వరదల సమయంలో అదే పాలేరు కాలువకు ఓ చోట గండి పడగా శనివారం నాటికి అధికారులు దానిని పూడ్చారు. ఆ తరువాత నీటి విడుదల కోసం ట్రయల్ రన్ వేశారు.
ఈ క్రమంలో అండర్ టన్నెల్ (యూటీ) సమీపంలో కాలువ నీళ్లు మరోసారి నీళ్లు లీక్ అయ్యాయి. దీంతో సమస్య ఒక్కసారిగా మళ్లీ తీవ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో యూటీని పేల్చి వేసి దానిని డమ్మీ చేశారు. అక్కడ స్టోర్ అయ్యే నీటిని నాలుగు 100 హెచ్పీ మోటర్ల ద్వారా తిరిగి నేరుగా కాలువలోకి పోయాలని నిర్ణయించారు. రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మూడుసార్లు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒకసారి ఈ మరమ్మతుల పనులను పరిశీలించారు. అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లీకేజీ పనులను కూడా ఎట్టకేలకు పూర్తి చేసి మంగళవారం తెల్లవారుజామున 4:30 గంటలకు రింగ్బండ్ తీసేసి క్రమంగా నీటిని వదిలారు. మొదట 500 క్యూసెక్కులను విడుదల చేశారు. క్రమంగా సామర్థ్యాన్ని పెంచుతూ మంగళవారం రాత్రి వరకు 2000 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. బుధవారం ఉదయం వరకు మూడు వేల క్యూసెక్కుల నీటి విడుదలకు ప్రణాళిక రూపొందించారు.
బండ్ ఎత్తును పెంచి బుధవారం వరకు జిల్లాలోని చివరి ఆయకట్టు రైతులకు కూడా పూర్తిస్థాయిలో నీటిని అందించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. బండ్ ఎత్తును ఇంకా 5 అడుగుల మేర పెంచి 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. అయిదే బుధవారం ఉదయం వరకు ఈ పనులు పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ ముత్తయ్యనాయుడు మంత్రికి సమాధానమిచ్చారు.
నీటిని వదిలిన తరువాత కాలువ ప్రవాహాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి.. ఎఫ్టీఎల్, కెనాల్ లెవెల్, బండ్ లెవల్ వంటి గణాంకాలను ఇరిగేషన్ అధికారులను అడిగారు. వారు సమాచారాన్ని ఇవ్వలేకపోవడంతో తీవ్రంగా ఆగ్రహించారు. ‘వచ్చే నీటి ప్రవాహాన్ని ఎలా ఎదుర్కోంటారు? ప్రత్యామ్నాయం ఏంటి?’ అని ప్రశ్నించారు. ఇద్దరు అధికారులను నియమించి గంటగంటకు దాని ప్రోగ్రెస్ను కలెక్టర్కు తెలియజేయాలని ఆదేశించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి, ఈఈ అనన్య, డీఈ మధు, ఏసీపీ తిరుపతిరెడ్డి, సీఐ సంజీవ్, ఎస్సై నాగగరాజు, నాయకులు పాల్గొన్నారు.