ఖమ్మం : కళ్లుండి చూడలేని.. చెవులు ఉండి వినలేని బీజేపీ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగలకపోదన్నారు మంత్రి అజయ్ కుమార్. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, తెలంగాణలో పండిన వరిధాన్యాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఖమ్మం నియోజకవర్గ కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ పొలాల్లో పల్లేరు కాయలు కూడా మొలవవన్న భూముల్లో రెండు పంటలు పండుతున్నాయంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వ సూపరిపాలనకు నిదర్శనమన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో మిషన్ కాకతీయ పథకం ద్వారా 20వేలకు పైగా చెరువులను పునరుద్ధరించి ప్రతి గ్రామంలో ప్రతి ఎకరానికి సాగునీరు అందేలా చర్యలు చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు , మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి , డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం, మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, సూడా చైర్మన్ విజయ్, అన్ని డివిజన్ల కార్పొరేటర్లు, రైతులు, నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు..