‘గిరిజన నియోజకవర్గమైన అశ్వారావుపేట సమగ్రాభివృద్ధికి మంత్రిగా పూర్తి సహకారం ఉంటుంది. వ్యవసాయంలో అశ్వారావుపేట నియోజకవర్గం రోల్ మోడల్గా నిలుస్తోంది’ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. మంగళవారం అశ్వారావుపేట నియోజకవర్గంలో మంత్రి విస్తృతంగా పర్యటించారు. ముందుగా జమ్మిగూడెంలో కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించారు. అక్కడికి వచ్చిన వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడారు. అనంతరం పాత మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆర్టీఏ సబ్ యూనిట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల ఎకరాల్లో ఆయిల్పాం సాగును విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికతో ముందుకు సాగుతున్నదన్నారు.
– అశ్వారావుపేట/ అశ్వారావుపేట టౌన్/ అశ్వారావుపేట రూరల్, మార్చి 14
అశ్వారావుపేట/ అశ్వారావుపేట టౌన్/ అశ్వారావుపేట రూరల్, మార్చి 14: వ్యవసాయంలో అశ్వారావుపేట నియోజకవర్గం రోల్ మోడల్గా నిలుస్తోందని, ఆయిల్పాం సాగుకు చిరునామాగా మారిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. భవిష్యత్తులో హార్టీకల్చర్ హబ్గా రూపుదిద్దుకుంటుందని అభిప్రాయపడ్డారు. గిరిజన నియోజకవర్గమైన అశ్వారావుపేట సమగ్రాభివృద్ధికి మంత్రిగా తన పూర్తి సహకారం ఉంటుందని అన్నారు. నియోజకవర్గంలో మంగళవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. ముందుగా జమ్మిగూడెంలో కంటి వెలుగు శిబిరాన్ని, తరువాత పాత మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆర్టీఏ సబ్ యూనిట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల ఎకరాల్లో ఆయిల్పాం సాగును విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికతో ముందుకు సాగుతుందన్నారు. రెండో ఫ్యాక్టరీ నిర్మాణానికి సీఎం రూ.10 కోట్లు ఆర్థిక సాయం అందించారన్నారు. మొక్కల ఉత్పత్తిలో ఏపీలోని కడియంతో అశ్వారావుపేట ఉద్యాన నర్సరీలే పోటీ పడుతున్నాయని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ పాలనపై పూర్తి విశ్వాసం ఉన్న ఇతర రాష్ర్టాల ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని గుర్తుచేశారు. సరిహద్దులో ఉన్న అశ్వారావుపేట.. ఆంధ్రప్రదేశ్కు గేట్వే గా ఉందని, దీనిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని అన్నారు. అతి త్వరలోనే మున్సిపాలిటీగా మారి అభివృద్ధిలో మరింత వేగం పుంజుకుంటుందని చెప్పారు. ఒక్క రోజులోనే సెంట్రల్ లైటింగ్ కోసం రూ.23.50 కోట్ల నిధులు కేటాయిస్తూ ఎమ్మెల్యే మెచ్చాకు జీవో అందించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. మరో నాలుగైదు నెలల్లో గోదావరి జలాలు ప్రజల ముగింటకు వస్తాయన్నారు.
అవన్నీ తుపాకీ రాముడి డైలాగులే..
కేసీఆర్ను గద్దె దించుతామంటూ కొందరు వ్యక్తులు పగటి కలలు గంటున్నారని విమర్శించారు. వారు వల్లెవేస్తున్న తుపాకీ రాముడి డైలాగులను ఉమ్మడి జిల్లా ప్రజలు నమ్మరని అన్నారు. బంగారు తెలంగాణ కోసం రాత్రింబవళ్లూ శ్రమిస్తున్న కేసీఆర్ను గద్దె దించుతావా? అంటూ ప్రశ్నించారు. మీలాంటి వారు కేసీఆర్ను ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. నీ పదవీ కాలంలో ఉమ్మడి జిల్లాలో ఏమి అభివృద్ధి చేశావో చూపాలని మాజీ ఎంపీ పొంగులేటికి సవాల్ విసిరారు.
2.15 లక్షల మందికి పరీక్షలు పూర్తి: కలెక్టర్
జిల్లాలో 5.30 లక్షల మందికి కంటి పరీక్షలు చేయడం లక్ష్యం కాగా ఇప్పటి వరకు 2.15 లక్షల మందికి పూర్తి చేసినట్లు కలెక్టర్ అనుదీప్ వివరించారు. జూన్ నాటికి ఈ లక్ష్యాన్ని పూర్తి చేస్తామన్నారు.
మంత్రికి ఘన స్వాగతం
అశ్వారావుపేట పర్యటనకు వచ్చిన మంత్రి పువ్వాడకు ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. శ్రేణుల ఉత్సాహం చూసిన మంత్రి అజయ్.. కారు దిగారు. ఎమ్మెల్యే మెచ్చాతో కలిసి బుల్లెట్ వాహనంపై బయలుదేరారు. భారీ ర్యాలీగా పట్టణానికి చేరుకున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు జోగేశ్వరరావు, శేషగిరిరావు, చిన్నంశెట్టి సత్యనారాయణ, వరలక్ష్మి, పైడి వెంకటేశ్వరరావు, జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, జయపాల్రెడ్డి, బోయినపల్లి వెంకట సుబ్బారావు, వేముల హరీశ్, మామిళ్లపల్లి లక్ష్మణరావు, యూఎస్ ప్రకాశ్రావు, తాడేపల్లి రవి, వెంకన్నబాబు, మందపాటి రాజమోహన్రెడ్డి, మోహన్, సత్యవరపు పాల్గొన్నారు.
కేసీఆర్ను ప్రజలు మర్చిపోరు: ఎమ్మెల్యే మెచ్చా
అడిగిన వెంటనే నిధులు మంజూరు చేస్తూ సీఎం కేసీఆర్, మంత్రి పువ్వాడ ఈ నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నారని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పేర్కొన్నారు. సంక్షేమ ఫలాలు అందిస్తున్న సీఎం కేసీఆర్ను ప్రజలు మర్చిపోరని అన్నారు. ఆయన పాలనకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రజల కోరిక మేరకు ఆర్టీఏ సబ్ యూనిట్, డిగ్రీ కళాశాల ఏర్పాటుతోపాటు రూ.23.50 కోట్లతో సెంట్రల్ లైటింగ్, రూ.30 కోట్లతో సీసీ రోడ్లను నిర్మిస్తున్నట్లు వివరించారు.