ఖమ్మం, సెప్టెంబర్ 28: ఖమ్మం నగరంలో కోట్లాది రూపాయల నిధులతో నిర్మిస్తున్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదేశించారు. నిర్మాణాల సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నగరంలోని రూ.1.80 కోట్లతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణ పనులకు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతో కలిసి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 16వ డివిజన్ ధంసలాపురంలో రూ.45 లక్షలు, 18వ డివిజన్ సీతారామనగర్లో రూ.45 లక్షలు, 23వ డివిజన్ ముస్తాఫానగర్లో రూ.45 లక్షలు, 55వ డివిజన్ బ్యాంక్కాలనీలో రూ.45 లక్షలతో ఈ నిర్మాణాలను చేపట్టినట్లు వివరించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు పునుకొల్లు నీరజ, ఆదర్శ్ సురభి, బచ్చు విజయ్కుమార్, బాలసాని లక్ష్మీనారాయణ, ఫాతిమా, పగడాల నాగరాజు, కమర్తపు మురళి, మేడారపు వెంకటేశ్వర్లు, మందడపు లక్ష్మీమనోహర్రావు, మోతారపు శ్రావణి సుధాకర్, షేక్ మక్బుల్ తదితరులు పాల్గొన్నారు.
నిర్మాణ పనుల పరిశీలన..
ఖమ్మం వీడీవోస్ కాలనీలో రూ.4.50 కోట్లు, ఖానాపురంలో రూ.4.50 కోట్లతో నిర్మిస్తున్న సమీకృత వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ల నిర్మాణ పనులను మంత్రి అజయ్కుమార్ పరిశీలించి మాట్లాడారు. ఇప్పటికే ఆలస్యమైన ఈ నిర్మాణ పనులను తక్షణమే వేగవంతం చేయాలని సూచించారు. రద్దీని నివారించేందుకు, మార్కెట్కు వచ్చే వారికి ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా అన్ని రోడ్లను అనుసంధానం చేయాలని అధికారులకు సూచించారు. ఈఈ రంజిత్కుమార్ తదితరులు పాల్గొన్నారు.