ఖమ్మం, జూలై 22: ఆడపిల్లల కోసం అనేకానేక పథకాలు అమలు చేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. పాపగా పుట్టినప్పటి నుంచి యువతిగా పెళ్లిపీటలెక్కే వరకూ అన్ని దశల్లోనూ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ఆడపిల్లలకు అండగా నిలుస్తోందని, ఆయా పథకాలను అందిస్తూ అక్కున చేర్చుకుంటోందని గుర్తుచేశారు. ఇందులో భాగంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు కూడా ఆడపిల్లలున్న తల్లిదండ్రులకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయని అన్నారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద నియోజకవర్గంలోని 97 మందికి మంజూరైన రూ.97.09 లక్షల విలువైన చెక్కులను ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయా లబ్ధిదారులకు మంత్రి అజయ్కుమార్ శుక్రవారం పంపిణీ చేశారు. చెక్కులతోపాటు చీరను అందజేశారు. అనంతరం వారికి ఆత్మీయ విందు ఏర్పాటు చేసి వారితో కలిసి సంహఫంక్తి భోజనం చేశారు. తొలుత లబ్ధిదారులకు ఆయనే స్వయంగా వడ్డించారు. మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, డిప్యూటీ మేయర్ ఫాతిమా, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, రఘునాథపాలెం జడ్పీటీసీ ప్రియాంక, కార్పొరేటర్లు దోరేపల్లి శ్వేత, షేక్ మక్బుల్, కోటేశ్వరరావు, జ్యోతిరెడ్డి, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ శైలజ తదితరులు పాల్గొన్నారు.