ఖమ్మం, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సాగు విస్తీర్ణంలో ఎప్పుడూ ముందుండే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఈసారి పూర్తిగా వెనుకబడింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ యాసంగి ఎండమావిని తలపిస్తోంది. దీంతో ఉమ్మడి జిల్లా చరిత్రలో ఎన్నడూలేని విధంగా తొలిసారిగా పంటల సాగు విస్తీర్ణం కనిష్ఠంగా నమోదైంది. ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటాయి. మరోవైపు ప్రస్తుత ప్రభుత్వ నిర్వాకం వల్ల ప్రధాన సాగునీటి వనరు అయిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎండిపోతోంది. ఫలితంగా దాని ఆయకట్టు అంతా ఎడారిగా మారింది. చుక్క సాగునీరు కూడా లేకపోవడంతో వరి పొలాలన్నీ నెర్రెలువారాయి. ఇంకోవైపు ఉద్యాన పంటల సాగు గణనీయంగా తగ్గడంతో కూరగాయల ధరలు ప్రియమవుతున్నాయి. ప్రధానంగా సాగునీరు లేకపోవడం, ఇప్పటికే వేసిన పంటలు ఎండిపోవడం వంటి కారణాలతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
సాగునీరు అందకపోవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే సాగు చేస్తున్న కొద్దిపాటి పంటలను కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. చేతికొచ్చిన పంటలు ఎండిపోతుండడంతో, నీరులేక పొలాలు నెర్రెలువారుతుండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పశువులకు మేతగా ఉపయోగిస్తున్నారు. ఇక వచ్చే నెలకు కనీసం తాగునీరు సైతం అందుబాటులో ఉంటుందా? అనే సందేహం మారుమూల గ్రామాల ప్రజలను వేధిస్తోంది. సాగర్ నీరు విడుదల కాకపోవడంతో జిల్లాలో సాగు గణనీయంగా తగ్గి కేవలం 1.50 లక్షల ఎకరాలకే పరిమితమైంది. బోర్లు, బావుల్లోనూ నీళ్లులేకపోవడంతో ఉద్యాన పంటల దిగుబడీ తగ్గింది. ఫలితంగా కూరగాయల ధరలు మరింత ప్రియమవుతున్నాయి.
జిల్లాలో వర్షాధారంతో సాగయ్యే భూములు కొన్ని ఉండగా.. ఇతర వనురుల కింద సాగయ్యే భూములు మరికొన్ని ఉన్నాయి. వీటిల్లో బోరుబావుల కింద 52,480 ఎకరాలు, చెరువుల కింద 56,005 ఎకరాలు, కాలువల కింద 2,39,986 ఎకరాలు, కుంటల కింద 95,843 ఎకరాలు, ఎత్తిపోతల పథకాల కింద మరో 15,865 ఎకరాలు సాగవుతున్నాయి. మొత్తంగా వివిధ సాగునీటి వనరుల ద్వారా వానకాలం సీజన్లలో సహజంగా 5,48,413 ఎకరాలు సాగు కావాల్సి ఉంటుంది. వీటితోపాటు కేవలం వర్షాధారంపై మరో 1,38,461 ఎకరాలు సాగవుతుంటాయి. యాసంగిలో ఇంచుమించుగా 3 లక్షల నుంచి 3.50 లక్షల ఎకరాలు సాగవుతుంటాయి. కానీ.. ఈసారి కేవలం 1.50 లక్షల ఎకరాల్లోనే యాసంగి పంటలు సాగవుతున్నాయి. తాజా గణాంకాల ప్రకారం 1,56,406 ఎకరాల్లో మాత్రమే రైతులు వివిధ పంటలను సాగు చేశారు. వీటిలో వరి 85,408 ఎకరాలు, మక్క 60,082 ఎకరాలు, పెసర 7,361 ఎకరాలు, చెరుకు 83 ఎకరాలు, వేరుశనగ 590 ఎకరాలు, మినుము 808 ఎకరాలు, కంది 135 ఎకరాలు, జొన్న 333 ఎకరాలు, ఇతర రకాలు మరో వెయ్యి ఎకరాల్లో మాత్రమే సాగవుతున్నాయి.
జిల్లాలోని 21 మండలాలకు గాను 16 మండలాలు సాగర్ ఆయకట్టు కిందే ఉన్నాయి. దీనికింద ఏటా వానకాలం సీజన్లో 3.50 లక్షల ఎకరాలు, యాసంగి సీజన్లో 1.60 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ పంటలను సాగు చేస్తుంటారు. ఈసారి సాగర్ నుంచి నీటి విడుదల లేకపోవడంతో ఆయకట్టు ప్రాంతమంతా ఎడారిని తలపిస్తోంది. అక్కడక్కడా పలువురు రైతులు పంటలు వేసినప్పటికీ నీరులేక అవి ఎండిపోయాయి.
గడిచిన ఐదేళ్ల భూగర్భ జలాల గణాంకాలకు భిన్నంగా ఈసారి నీటి నిల్వలు మరింత కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఏటా జనవరిలో చేసే సర్వే ప్రకారం జిల్లాలో సగటున 4.46 మీటర్ల లోతులో నీటి లభ్యత ఉంటుంది. కానీ.. ఈ ఏడాది అది 5.46 మీటర్లకు పెరిగింది. సత్తుపల్లి, ఎర్రుపాలెం, సింగరేణి, కామేపల్లి, ఏన్కూరు వంటి మండలాల్లో భూగర్భ జలాలు మరింత తగ్గాయి. మార్చి నెల చివరి నాటికి ఇవి మరింత తగ్గే ప్రమాదముందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
సాగునీటి నిల్వల ప్రభావం ఉద్యాన పంటలపై పడింది. దీంతో కూరగాయల ధరలు ప్రియమవుతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై ఎక్కువగా పడుతోంది. కూరగాయల సాగు 2021-22 యాసంగిలో 1,780 ఎకరాల్లో జరిగితే.. 2022-23లో అది 1883 ఎకరాలకు పెరిగింది. కానీ.. ప్రస్తుత 2023-24 సీజన్లో కేవలం 1,277 ఎకరాల్లోనే కూరగాయలు సాగవుతున్నాయి.