ఖమ్మం, జూలై 26 : వాతావరణశాఖ ఖమ్మం జిల్లాకు రెడ్అలర్ట్ ప్రకటించిందని, రాబోయే 48 గంటల్లో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నందున జాగ్రత్తగా ఉండి ప్రాణనష్టం జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీవోసీలోని తన చాంబర్ నుంచి పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్తో కలిసి, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులతో వర్ష పరిస్థితులపై టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వాతావరణశాఖ సూచన ప్రకారం 40 సెంటీమీటర్లకు పైగా వర్ష సూచన ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నిరంతరం పర్యవేక్షణ చేస్తూ పరిస్థితులను ఎదుర్కొనేలా అప్రమత్తంగా ఉండాలన్నారు. పీఆర్, ఆర్అండ్బీ, ఇరిగేషన్ ఇంజినీర్లు సంబంధిత తహసీల్దార్లతో టచ్లో ఉండాలన్నారు. నీటి వనరులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. వాగులు పొంగిపొర్లి కల్వర్టుల వద్ద ప్రవాహం అధికమై రాకపోకలు జరపకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదానికి ఆస్కారం ఉండి అవసరమున్న చోట రహదారిని మూసివేయాలని సూచించారు. ప్రమాదమున్న చెరువుల వద్ద ఇసుక బస్తాలను సిద్ధం చేసుకోవాలన్నారు. వర్షంలో చేపలకు అనుమతించొదన్నారు.
ముంపునకు గురయ్యే ప్రాంతాలు పీఆర్, ఆర్అండ్బీ రోడ్లపై కల్వర్టులపై నీరు ప్రవహించే ప్రాంతాల్లో రవాణా నిషేధించి, రాత్రి, పగలు సిబ్బందితో నిఘా పెట్టాలన్నారు. జిల్లాలో 128 చెరువులు అలుగు పారుతున్నట్లు, అలుగుల వద్ద చేపలు పట్టకుండా నివారించాలన్నారు. రోడ్ల మూసివేతపై సంబంధిత గ్రామాల్లో టాంటాం వేయించాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఏయే చెరువులు, కుంటలు ప్రమాదకరమో అంచనా వేసుకొని అందుకు అనుగుణంగా నష్ట నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఉరుములు, పిడుగులతో ప్రాణనష్టం జరుగుతున్నట్లు చెప్పారు. వీటి నివారణకు దామిని యాప్ డౌన్లోడ్పై అవగాహన కల్పించాలన్నారు. దామిని యాప్తో పిడుగుల గురించి ముందస్తుగా తెలుసుకునే అవకాశం ఉందని తెలిపారు. సీపీ విష్ణు ఎస్ వారియర్ మాట్లాడుతూ.. పోలీస్ అధికారులు నిరంతరం స్థానికంగా ఉంటూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి పోలీస్ వాహనంలో రోప్, టార్చ్, ట్రీ కట్టర్, గొడుగు వంటి వస్తువులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అధికారులు, సిబ్బందికి ఎలాంటి సెలవులు మంజూరు చేయడం జరగదన్నారు. అదనపు కలెక్టర్ మధుసూదన్, ఇరిగేషన్ సీఈ శంకర్నాయక్, జడ్పీ సీఈవో అప్పారావు, జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల, సీపీవో శ్రీనివాస్, ఆర్అండ్బీ ఈఈ శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.