ఖమ్మం:కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు మీడియా అకాడమీ ద్వారా ఆర్ధిక సాయం అందించారు. జిల్లాలో 7 కోవిడ్ బాధిత కుటుంబాలు, మరో 2 సహజ మరణ కుటుంబాలు, అనారోగ్యానికి గురైన మరో జర్నలిస్టుకు చెక్కులు అందచేశారు. బుధవారం హైద్రాబాద్లోని మీడియా అకాడమీ కార్యాలయంలో చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన జరిగిన కార్యాక్రమంలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, ఎంఎల్సీ గోరేటి వెంకన్నలు చెక్కులు పంపిణీ చేశారు.
కోవిడ్తో చనిపోయిన ఒక్కొ కుటుంబానికి రూ 2 లక్షల చొప్పున మొత్తం 14 లక్షలు, సహజ మరణించిన ఇద్దరికి లక్ష చొప్పున, పక్షవాతానికి గురైన జర్నలిస్టుకు రూ 50 వేలు చొప్పున ఆర్ధిక సాయం అందించారు. ఈ సందర్బంగా అల్లం నారాయణ మాట్లాడుతూ శిక్షణ, సంక్షేమం, అనే లక్ష్యంతో మీడియా అకాడమీ పనిచేస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యుజే ఖమ్మం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, సయ్యద్ ఇస్మాయిల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కల్లోజి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు లక్ష్మణ్, బెంజు అధ్యక్షులు వట్టికొండ రవి తదితరులు పాల్గొన్నారు.