మెదక్ న్యూస్ నెట్వర్క్, ఆగస్టు 22 ;ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మెతుకు సీమ గడ్డపై సీఎం కేసీఆర్ ‘ప్రగతి శంఖారావం’ పూరించారు. భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలతో మెదక్ పట్టణం గులాబీమయమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని బుధవారం మంత్రులు హరీశ్రావు, మహమూద్ అలీ, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, మధన్రెడ్డి, క్రాంతికిరణ్, అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం సీఎస్ఐ చర్చి గ్రౌండ్లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఎన్నికలు వస్తున్నాయని ఆగం కావొద్దు. ఈ సమయంలోనే మన ధీరత్వం ప్రదర్శించాలి. ఒకనాడు మెదక్ జిల్లా ప్రజలు తాగేందుకు, పంటల కోసం నీరులేక గోసవడ్డరు. ఇవాళ కాళేశ్వరం జలాలతో వాగులపై చెక్డ్యామ్లు మత్తళ్లు దుంకుతున్నాయి. ఇవాళ లక్ష్మీ అమ్మవారు ఓలలాడుతున్నట్లుగా అద్భుతమైన పంటలు పండుతున్నాయి. నాడు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఈ సోయి ఉన్నదా..? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ప్రసంగం ఆసాంతం జై తెలంగాణ.. జై బీఆర్ఎస్.. జైజై కేసీఆర్ నినాదాలు మిన్నంటాయి. పెద్ద ఎత్తున ప్రజలు, అభిమానులు, పార్టీ శ్రేణులు తరలిరావడంతో సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. కళాకారులతో కలిసి మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తన పాటలతో అందరినీ ఉత్సాహపరిచారు. సభా వేదికగా ముఖ్యమంత్రి మెదక్ జిల్లాకు వరాల జల్లు కురిపించారు.