నమస్తే నెట్వర్క్, మే 1 : ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా వాడవాడలా ఎర్రజెండా ఎగిరింది. మేడే సందర్భంగా కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో పల్లె, పట్టణం తేడాలేకుండా శుక్రవారం అరుణ పతాకాలు రెపరెపలాడాయి. కార్మికులంతా జెండాలను చేతబూని పెద్దఎత్తున ర్యాలీలు నిర్వహించారు. కార్మికుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. వక్తలు, కార్మిక నేతలు మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హకులను కాపాడుకోవడానికి కార్మికులంతా సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఖమ్మం రైతుబజార్ ఆటో అడ్డా వద్ద మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ గులాబీజెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ కార్మికుల ఐక్యత, హక్కుల సాధనకు మేడే ప్రతీకగా నిలిచిందన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేశారని గుర్తుచేశారు. కార్మికుల హక్కులను కాపాడటం, సామాజిక భద్రత కల్పించడంలో రాష్ట్రంలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అనేకరంగాల్లో అసంఘటితంగా ఉన్న కార్మికులకు బీఆర్ఎస్ ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ నాయకులు ఆయా చోట్ల గులాబీ జెండాలను ఎగురవేశారు. రామవరం టీబీజీకేఎస్ కార్యాలయంలో ఆ సంఘం రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ, కూసుమంచిలో పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి తదితరులు మేడే పతాకాలను ఎగురవేశారు.