భద్రాచలం, నవంబర్ 10 : సీఎం కేసీఆర్ రైతు పక్షపాతని, రైతును రాజుగా చూడాలనే లక్ష్యంతో రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి ఉచిత కరెంట్, రుణమాఫీ తదితర పథకాలను అమలుచేస్తున్నారని బీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు, ఎమ్మెల్సీ, భద్రాచలం నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి తాతా మధుసూదన్ అన్నారు. శుక్రవారం భద్రాచలం పట్టణంలోని శాంతినగర్కాలనీలో టీడీపీ నుంచి సుమారు 100 రైతు కుటుంబాల వారు రైతుబంధు సమితి మండల అధ్యక్షులు దారపునేని రాంబాబు, దుద్దుకూరి సాయిబాబా ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రైతులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో వారు మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కరెంట్ లేక రైతులు ఎన్నో ఇబ్బందులు పడేవారని, తెల్లవారుజామున 3గంటలకు కరెంట్ ఇస్తే ఆ చీకట్లో పొలంకాడికి వెళ్లి మోటర్లు వేసిన రోజులు ఉన్నాయని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయానికి 24గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నట్లు తెలిపారు.
గతంలో విత్తనాలు, ఎరువులు కొనుక్కోవడానికి డబ్బులు లేక అధిక వడ్డీకి అప్పులు తెచ్చి, పండిన పంటకు గిట్టుబాటు ధరలేక, తెచ్చిన అప్పులు తీర్చలేక ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. నేడు జూన్, డిసెంబర్లో రైతుబంధు డబ్బులు పడుతుండడంతో రైతులు దీమాగా వెళ్లి విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ రోజుల్లో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి సాయం అందలేదని, ఈ రోజున రైతు ఏ కారణంగా మరణించినా అతడి కుటుంబానికి రూ.5 లక్షలు ఇస్తున్న ఘనత బీఆర్ఎస్ సర్కార్దేనని అన్నారు. భద్రాచలంలో బీఆర్ఎస్ జెండా ఎగురవేసి సీఎం కేసీఆర్కు కానుకగా ఇవ్వాలని కోరారు. పలువురు రైతులు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలోనే తమకు మేలు జరిగిందని అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని పేర్కొన్నారు. టీడీపీ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చిన వారందరికీ బీఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో కొండవీటి రమేశ్, చిన్ని, చందు, పాపారావు, సవరయ్య, చెన్నయ్య, మోహన్రావు, శ్రీను, దారపునేని ప్రభాకర్, సురపనేని వేణు, ముదునూరి రామచంద్రరాజు ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కార్యదర్శి కొండిశెట్టి కృష్ణమూర్తి, తాళ్లపల్లి రమేశ్గౌడ్, బొలిశెట్టి రంగారావు, నవాబ్, చావా లక్ష్మీనారాయణ, అడుసుమిల్లి జగదీశ్, మోతూకూరి వీరయ్య, పల్లంటి దేశప్ప, కొర్లపాటి రాము, పోటు కిరణ్, పల్లంటి నరేశ్, జాస్తి గంగాభారతి, ఈర్ల భారతి, కావూరి సీతామాలక్ష్మి, కేతినేని లలిత తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం, నవంబర్ 10 : సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, సీపీఐ నియోజకవర్గ కన్వీనర్ రావులపల్లి రాంప్రసాద్ శనివారం హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరనున్నారు. శుక్రవారం ఆయన సీపీఐ పార్టీకి రాజీనామా చేశారు. ఈక్రమంలో ఎమ్మెల్సీ, భద్రాచలం నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి తాతా మధుసూదన్, బీఆర్ఎస్ భద్రాచలం ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు రాంప్రసాద్ నివాసానికి వెళ్లి అభినందనలు తెలిపి, శాలువాతో రాంప్రసాద్ దంపతులను సత్కరించారు. రాంప్రసాద్ మాట్లాడుతూ శనివారం హైదరాబాద్ వెళ్లి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసెడెంట్ కేటీఆర్ సమక్షంలో చేరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు దారపునేని రాంబాబు, సునీల్కుమార్ పాల్గొన్నారు.
పర్ణశాల, నవంబర్ 10 : మండల పరిధిలోని చిన్నబండ్రేవు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీలో శుక్రవారం భారీగా చేరికలు జరిగాయి. బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావు సమక్షంలో జడ్పీటీసీ తెల్లం సీతమ్మ ఆధ్వర్యంలో చిన్నబండ్రేవు గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన 50 కుటుంబాలు, నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలోకి చేరి గులాబీ కండువాలు కప్పుకున్నారు. తెల్లం వెంకట్రావ్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే భద్రాచలం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రేసు లక్ష్మి, సర్పంచ్ కే.జయమ్మ, పార్టీ నాయకులు పాల్గొన్నారు.