ఖమ్మం ఎడ్యుకేషన్, మార్చి 12: ‘మన ఊరి- మన బడి’/ ‘మన బస్తీ- మన బడి’లో భాగంగా ఒక్కో ప్రభుత్వ బడి అన్ని వసతులతో అందుబాటులోకి వస్తున్నది. కార్పొరేట్ బడులను తలదన్నేలా విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తున్నది. ఖమ్మం నగరంలో ఇప్పటికే మూడు పాఠశాలలు ప్రారంభోత్సవాలు జరుపుకొన్నాయి. తాజాగా సంభానినగర్, ఇందిరానగర్ ప్రాథమిక పాఠశాలలు సిద్ధమయ్యాయి. సోమవారం ఈ పాఠశాలలను మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రారంభించనున్నారు. వేడుకకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
మౌలిక సదుపాయాలు కల్పించి…
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మన బడి- మన బస్తీ’ అమలు చేస్తున్నది. రూ.లక్షలు కేటాయియించి ప్రభుత్వ బడుల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నది. అభివృద్ధి పనులకు అంచనాలు వేయించి, నిధులు కేటాయించి పనులు పూర్తి చేయిస్తున్నది. దీనిలో భాగంగా సంభానినగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు రూ.26 లక్షలు కేటాయించింది. ఈ నిధుల్లో రూ.2 లక్షలతో తాగునీటి వసతి, రూ.40 వేలతో ప్రహరీ, రూ.4 లక్షలతో మరుగుదొడ్లు, రూ.2 లక్షలతో మేజర్, మైనర్ రిపేర్స్, రూ.3 లక్షలతో విద్యుత్ సౌకర్యం, రూ.10 లక్షలతో డ్యూయల్ డెస్క్లు, రూ.10 లక్షలతో ఫర్నీచర్, రూ.1.30 లక్షలతో గ్రీన్ చాక్ బోర్డు, రూ.3 లక్షలతో పెయింటింగ్ పనులు పూర్తయ్యాయి.
ఇందిరానగర్ స్కూల్కు రూ.77 లక్షలు..
ఇందిరానగర్ స్కూల్ అభివృద్ధికి ప్రభుత్వం రూ.77 లక్షలు కేటాయించింది. ఈ నిధుల్లో రూ.35 లక్షలతో తాగునీటి వసతి, రిపేర్స్, ప్రహరీ, అదనపు తరగతులు, రూ.10 లక్షలతో మరుగుదొడ్లు, కిచెన్ షెడ్డు, మిగిలిన నిధులతో డ్యూయల్ డెస్క్లు, గ్రీన్ చాక్బోర్డులు, టీచర్స్ టేబుల్స్, చైర్స్, పెయింటింగ్ పనులు పూర్తయ్యాయి.