పెనుబల్లి: ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం చేసిన వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు.సత్తుపల్లి రూరల్ సీఐ కరుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం..రెండు నెలల క్రితం మండలంలోని గంగదేవిపాడుకు చెందిన ఓ యువకుడి వద్ద ఉద్యోగం ఇప్పిస్తానంటూ డబ్బులు తీసుకుని మోసం చేయడంతో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దమ్మపేట మండలానికి చెందిన మద్దిశెట్టి సామేలు అనే వ్యక్తి మోసం చేయడంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని తేలడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
సామేలు అప్పటి నుంచి పరారీలో ఉండగా గురువారం బయ్యన్నగూడెం వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. కష్టపడి ఉద్యోగాలు సాధించాల్సిన యువకులు మోసగాళ్ళ మాటలు విని జీవితాలను నాశనం చేసుకోకూడదని, మద్దిశెట్టి సామేలుపై గతంలో దమ్మపేట మండలంలో రౌడీషీటర్ నమోదు అయిందని, అలాగే ఏన్కూరు, సత్తుపల్లి మండలంలో పోడుభూములకు పట్టాలు ఇప్పిస్తానని, డబుల్ బెడ్రూం ఇళ్ళు ఇప్పిస్తానని చాలా మంది అమాయకుల నుంచి డబ్బులు తీసుకోవడంతో ఆయనపై కేసులు నమోదు చేయడం జరిగిందని సీఐ కరుణాకర్ అన్నారు.