కారేపల్లి, జనవరి 3: ‘రాష్ట్రప్రభుత్వం మహాలక్ష్మి పథకం అమలు చేస్తూ మా కడుపు మీద కొడుతుంది..’ అని ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రానికి చెందిన ఆటోవాలాలు బుధవారం ఖమ్మం- ఇల్లెందు ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించడంతో తమ ఆదాయం పూర్తిగా పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవర్లలో ఎక్కువ మంది ఫైనాన్స్పై ఆటో తీసుకున్న వారేనని, ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం కిస్తీలు కూడా కట్టలేకున్నామని వాపోయారు. ఫ్రీ బస్ పథకంపై రాష్ట్రప్రభుత్వం పునరాలోచన చేయాలని వేడుకుంటున్నారు. కుటుంబ పోషణ భారంగా ఉందని, పిల్లలను చదివించుకోలేకపోతున్నామని అన్నారు. రాస్తారోకోలో ఆటో యజమానులు ప్రభాకర్, శ్రీను, రవి, నాగయ్య, పండు, ప్రసాద్, ఖాదర్, సాగర్, సందీప్, కృష్ణ, బాలు, కుమార్, బిట్టు, యాకూబ్పాషా, సత్తి పాల్గొన్నారు.