కొత్తగూడెం అర్బన్, మార్చి 21 : గ్యారెంటీ హామీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం వల్ల ఆటో డ్రైవర్ల బతుకులు దుర్భరంగా మారాయని తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి మర్రి కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులపై బెల్లంపల్లికి చెందిన రవికుమార్ ‘ఆటో బతుకులు’ అనే అంశంపై వంద ఎపిసోడ్ల సీరియల్ తీస్తున్న నేపథ్యంలో బెల్లంపల్లి నుంచి సీరియల్ యూనిట్ సభ్యులు గురువారం కొత్తగూడెం చేరుకున్నారు. వారికి తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ (టీఏడీయూ) నాయకులు ఘన స్వాగతం పలికారు. కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో ఆటో డ్రైవర్లు, వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న, అనుభవిస్తున్న బాధల గురించి యూనిట్ సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా ‘ఆటో బతుకులు’ సీరియల్ హీరో రవికుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయంంతో ఆటోలపై ఆధారపడి జీవిస్తున్న తమ బతుకులు రోడ్డున పడ్డాయన్నారు. తమ బాధలను కళ్లకు కట్టినట్లు చూపించే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్ల సమస్యలపై వంద ఎపిసోడ్లతో కార్యక్రమాలను రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. టీఏడీయూ పట్టణ కార్యదర్శి మాటేటి వెంకట్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ధర్మపురి నరేశ్, గుండ్ల రాజు, జీడీ శ్రీను, లకావత్ రమేశ్, చిలక వెంకట్, చంటి, మాధవరావు, శ్రీకర్, చందు, బస్టాండ్ అడ్డా ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.