వికారాబాద్, ఆగస్టు 13 : ప్రతి ఇంటికి నిరంతరం నీటి సరఫరా అందించాలనే లక్ష్యంతో అమృత్ 2.0ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఇందుకు ప్రత్యేకంగా నిధులను సైతం ఏర్పాటు చేసి వాటర్ ట్యాంకులు, పైపులైన్లు, మినీ వాటర్ ట్యాంకుల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా గత సంవత్సరం జనవరి నెలలో స్పీకర్, ఎంపీలు, అధికారులు కలిసి పనులను ప్రారంభించారు. దీంతో నీటి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని పట్టణ ప్రజలు సంతోషపడ్డారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 34 వార్డులకు పూర్తి స్థాయిలో ప్రతి ఇంటికి నీటిని సరఫరా చేయాలనే ముఖ్య ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రూ.12కోట్లతో అమృత్ 2.0 పనులు ప్రారంభించింది.
వికారాబాద్లోని రామయ్యగూడ ఎంఐటీలో ఒక ట్యాంకు, కలెక్టరేట్ సమీపంలోని శ్రీవెంకటసాయి కాలనీలో మరో ట్యాంక్ నిర్మాణం కోసం పనులు ప్రారంభించారు. రామయ్యగూడ ఎంఐటీలో పునాదుల వరకే పనులు జరిగి నిలిచిపోయాయి. పనులు నిలిచిపోయి దాదాపు సంవత్సరానికి పైగా గడుస్తున్నా ఇప్పటికీ అధికారులు, పాలకులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. శ్రీవెంకటసాయి కాలనీలో చేపడుతున్న ట్యాంకు పనులు నత్తనడకన సాగుతున్నాయి. సమస్యల పరిష్కారం కోసం స్పందించడం లేదని ఆయా వార్డుల ప్రజలు కాంగ్రెస్ పాలన తీరుపై మండిపడుతున్నారు.
వికారాబాద్ ప్రాంతానికి చెందిన స్పీకర్, ఎంపీ, మున్సిపల్ చైర్పర్సన్, కలెక్టర్, అధికారులు స్పందించి నిలిచిపోయిన పనులను వెంటనే ప్రారంభించి పనులు పూర్తి చేయాలని మున్సిపల్ ప్రజలు కోరుతున్నారు. ఇదిలా ఉండగా.. రామయ్యగూడ ఎంఐటీ కాలనీలో చేపట్టే వాటర్ ట్యాంక్ నిర్మాణ సమయంలో కాంట్రాక్టర్ తెచ్చిన వాటర్ పైపులు దొంగలు ఎత్తుకుపోయారు. కాంట్రాక్టర్ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కొంత మేరకు రికవరీ చేశారు. అయినా నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పనులు ముందుకు సాగడంలేదు.