ఖమ్మం, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం మద్యం టెండర్ల ప్రక్రియ షురూ అయింది. తొలిరోజు భద్రాద్రి జిల్లాను తొమ్మిది దరఖాస్తులు, ఖమ్మం జిల్లా నుంచి రెండు దరఖాస్తులు అందినట్లు ఎక్సైజ్శాఖ అధికారులు తెలిపారు. గతంలో ఒక వ్యక్తి ఒకే మద్యం దుకాణానికి దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన ఉండేది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను సడలించి ఎవరు ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తు చేసుకోవచ్చనే నిబంధన అమలు చేస్తుండడంతో ఎక్కువ మంది ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఖమ్మం జిల్లాకేంద్రంలోని వీడియోస్ కాలనీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్-1లో టెండరు బాక్సులు ఉంటాయని జిల్లా ఎక్సైజ్శాఖ సూపరింటెండెంట్ నాగేంద్రరెడ్డి తెలిపారు. ఈనెల 21న లేక్వ్యూ (సీక్వెల్ రిసార్ట్స్) వేదికగా కలెక్టర్ సమక్షంలో లక్కీ డ్రా తీసి దుకాణాలు కేటాయిస్తామన్నారు. 21 ఏళ్లు పైబడిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. దరఖాస్తుదారులు ఒక షాపునకు రూ.2 లక్షల డీడీ లేదా చలానా రూపంలో చెల్లించాలన్నారు.
‘ఏ4’ దుకాణాల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
కొత్తగూడెం క్రైం, ఆగస్టు 4: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన మద్యం పాలసీకి దరఖాస్తుదారులు ఆకర్షితులవుతున్నారని, ఈసారి కూడా ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నదని జిల్లా ఆబ్కారీశాఖ అధికారి ఎస్.జానయ్య తెలిపారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఎక్సైజ్శాఖ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలిరోజు ఏ4 మద్యం దుకాణాల టెండర్లకు దరఖాస్తులు స్వీకరించామన్నారు.
జిల్లాలో 88 మద్యం దుకాణాలకు 2023-25 సంవత్సరాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. దరఖాస్తులకు ఈ నెల 18 వరకు గడువు ఉందన్నారు. ఈ 21న కలెక్టర్ సమక్షంలో లక్కీ డ్రాలు తీస్తామన్నారు. తొలిరోజు అశ్వారావుపేట ఎక్సైజ్ స్టేషన్కు తొమ్మిది దరఖాస్తులు అందాయన్నారు. సమావేశంలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ కరమ్చంద్, జిల్లా టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ చెన్నా నాగేశ్వరరావు, కొత్తగూడెం ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎల్.జయశ్రీ, భద్రాచలం ఇన్స్పెక్టర్ రహీమున్నిస్సా బేగం, పాల్వంచ ఇన్స్పెక్టర్ గురునాథ్ రాథోడ్, అశ్వారావుపేట ఇన్స్పెక్టర్ నాగయ్య, మణుగూరు ఇన్స్పెక్టర్ జె.రామ్మూర్తి, ఇల్లెందు ఇన్స్పెక్టర్ బి.రామ్ప్రసాద్, ఎస్సైలు పాల్గొన్నారు.