సారపాక, జూలై 22 : తెలంగాణ ప్రభుత్వ పథకా లు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అన్ని వర్గాల ప్రజల్లోనూ విశేష ఆదరణ లభిస్తోందని అన్నారు. అందుకే అందరూ వచ్చి బీఆర్ఎస్లో చేరుతున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులైన చర్ల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 20 కుటుంబాల వారు శనివారం మణుగూరు వచ్చి ఇక్కడి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారందరికీ రేగా కాంతారావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే అన్ని వర్గాల ప్రజలకూ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. ఇక్కడి పథకాలను స్ఫూర్తిగా తీసుకున్న ఇతర రాష్ర్టాల ప్రభుత్వాలు అక్కడ కూడా ఇలాంటి పథకాలను అమలు చేస్తున్నాయని గుర్తుచేశారు. అయితే కాంగ్రెస్ నాయకులు మాత్రం రైతులను మళ్లీ మోసగించేలా పూటకో మాట మాట్లాడుతూ వారిని గందరగోళ పరుస్తున్నారని అన్నారు. గతంలో కాంగ్రెస్ పాలనలో అరిగోస పడ్డ రైతులు మళ్లీ వారి మాయమాటలను గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చర్ల ఏఎంసీ మాజీ చైర్మన్ బోదెబోయిన బుచ్చయ్య, బీఆర్ఎస్ నాయకులు సోయం రాజారావు, కోటేరు శ్రీనివాసరెడ్డి, తుర్రం రవికుమార్, సీతాపతిరాజు, జోగిరాజు తదితరులు పాల్గొన్నారు.