మామిళ్లగూడెం, డిసెంబర్ 22 : నిబంధనల మేరకు నిర్ణీత గడువులోగా జిల్లాలో లే అవుట్ల అనుమతులను పూర్తి చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లాస్థాయి లే అవుట్ల అప్రూవల్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖమ్మం నగర పాలక సంస్థ, వైరా, మధిర, సత్తుపల్లి, మున్సిపాల్టీల పరిధిలో, సుడా పరిధిలోని లే అవుట్ల ఆమోదం కోసం అందిన 23 దరఖాస్తులను పరిశీలించారు. నిబంధనల మేరకు సమర్పించిన దరఖాస్తులను కమిటీ ఆమోదించింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో లే అవుట్ల ఆమోదం కోసం రెవెన్యూ, విద్యుత్, ఇరిగేషన్, రోడ్లు, భవనాలు, టౌన్ ప్లానింగ్ తదితర అనుబంధ శాఖల నుంచి అనుమతుల కోసం సమర్పించిన దరఖాస్తులను ఆయా శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించాలన్నారు.
వాటికి 21 రోజులలోపు అనుమతులు జారీ చేయాలని ఆదేశించారు. తర్వాత జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో ఆమోదం జరుగుతుందన్నారు. గ్రీనరీ కోసం కేటాయించిన స్థలాన్ని వెంటనే స్వాధీనం చేసుకొని మొక్కలు నాటాలన్నారు. లే అవుట్ల డెవలపర్స్ నిబంధనల మేరకు ప్రణాళికాబద్ధంగా ల్యాండ్ డెవలప్మెంట్ పనులు చేపట్టాలని సూచించారు. సమావేశంలో ఖమ్మం నగర సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, ఆర్డీవో గణేశ్, జడ్పీ సీఈవో అప్పారావు, డీపీవో హరికిషన్, పీఆర్ ఎస్ఈ చంద్రమౌళి, ఏడీ సర్వే ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాసులు, డీటీసీపీవో ప్రసాద్, టీపీవో వికాస్, సత్తుపల్లి, మధిర, వైరా మున్సిపల్ కమిషనర్లు సుజాత, రమాదేవి, కరుణాకర్రెడ్డి, తహసీల్దార్లు, ఇరిగేషన్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.