ఆరు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు
ఖమ్మం జిల్లాలో మత్తడి దుంకుతున్న 705 చెరువులు
నిండుకుండల్లా పాలేరు, వైరా, లంకాసాగర్ రిజర్వాయర్లు
పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు, కుంటలు, కాలువలు
వానకాలంతోపాటు యాసంగికీ ఢోకా లేదంటున్న రైతులు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పాలేరు, వైరా, లంకాసాగర్ రిజర్వాయర్లలోకి భారీగా వరద నీరు చేరడంతో నిండుకుండలను తలపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో మొత్తం 1,409 చెరువులు ఉండగా 705 చెరువులు మత్తడి దుంకుతున్నాయి. మరో మూడు రోజులు ఇదే విధంగా వానలు కురిస్తే 414 చెరువులు అలుగులు పోసే అవకాశం ఉంది. జలాశయాలన్నీ నిండిపోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఖమ్మం, జూలై 13: ఖమ్మం జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. ఆరు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లాలో జన జీవనానికి ఆటంకం కలుగుతోంది. ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. రోజువారీ కూలి పనులకు వెళ్లే వారు ఇంటికే పరిమితమయ్యారు. పాలేరు, వైరా, లంకాసాగర్ రిజర్వాయర్లలోకి భారీగా వరద నీరు చేరడంతో నిండుకుండలను తలపిస్తున్నాయి. జిల్లాలో మొత్తం 1,409 చెరువులు ఉండగా బుధవారం నాటికి 705 చెరువులు మత్తడి దుంకుతున్నాయి. మరో నాలుగు రోజులు ఇదే విధంగా వాన కురిస్తే ఇంకో 414 చెరువులు కూడా అలుగులు పోసే అవకాశం ఉంది. జలాశయాలన్నీ నిండిపోవడంతో రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వానకాలంలో సీజన్లోనే కాకుండా రానున్న యాసంగికి సాగునీటి ఇబ్బందులు ఉండవని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి
మునిగిన పంటలు..
వర్షాల కారణంగా వేలాది ఎకరాల్లో పంట భూములు మునిగిపోయాయి. పలు రహదారులు దెబ్బతిన్నాయి. దీంతో వ్యవసాయ శాఖ అధికారులకు అప్రమత్తమయ్యారు. పంటలు దెబ్బతినకుండా తీసుకోవాల్సిన చర్యలపై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇటు రహదారులు దెబ్బతినడం, వాగులు పొంగి ప్రవహిస్తుండడంతో కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను అప్రమత్తం చేశారు. రహదారుల మీదుగా వాగులు ప్రవహిస్తున్న చోట రాకపోకలను నిలిపివేశారు.
ఆయకట్టు సస్యశ్యామలం..
ఆరు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఖమ్మం జిల్లాలోని ఆయకట్టు మొత్తం సస్యశ్యామలం అవుతోంది. రైతులు రెండు పంటలను సాగు చేసుకునేందుకు సరిపడా నీళ్లను అందుబాటులోకి వచ్చాయి. జిల్లాలోని రెండున్నర లక్షల ఎకరాల నాగార్జునసాగర్ ఆయకట్టుకు ఈ వానకాలం సీజన్కు ఢోకాలేదు. యాసంగికి కూడా ఇబ్బంది ఉండకపోవచ్చు. –శంకర్నాయక్, సీఈ, నీటిపారుదల శాఖ, ఖమ్మం
నిండిన చెరువులు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకం వల్ల ఇప్పటికే భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో సాధారణ వర్షాలకు సైతలు చెరువులన్నీ నిండుతున్నాయి. జిల్లాలో ఎన్ని చెరువులు ఉన్నాయి? అవి ఏ మేరకు నిండాయి? అనే వివరాలు ఇలా ఉన్నాయి.