మామిళ్లగూడెం, జనవరి 30: జిల్లాలో నిర్దేశిత ఆయిల్పాం పంటల సాగు లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. ఆయిల్పాం పంటల సాగుపై వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులతో ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కాంప్లెక్స్ (ఐడీవోసీ) కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 12,100 ఎకరాల్లో ఆయిల్పాం మొకలు నాటే లక్ష్యాన్ని నిర్దేశించినట్లు చెప్పారు. 2023 జనవరి చివరి నాటికి 8,500 ఎకరాల్లో సాగు చేపట్టాల్సిన లక్ష్యంగా ఉండగా జనవరి 28 నాటికి 7,207.85 ఎకరాల్లో (85 శాతం) 1,694 మంది రైతులు తమ భూముల్లో ఆయిల్పాం పంటల సాగును మొదలు పెట్టినట్లు తెలిపారు.
ఆయిల్పాం తోటలను సాగు చేసేందుకు నీటి వసతి, విద్యుత్ సౌకర్యం ఉన్న భూములు కలిగిన రైతులను గుర్తించాలని సూచించారు. మండలం వారీగా మండల వ్యవసాయ అధికారులు ఆయిల్పాం పంటల సాగుతో లాభాలు, సాగుకు వచ్చే సబ్సిడీలు వంటి వాటి గురించి తెలియజేస్తూ రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆయిల్పాం సాగుతోపాటు అందులో అంతర పంటలనూ సాగు చేయవచ్చన్నారు. జిల్లాలో 40 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ రైతులు ఉన్నారని, ఆయిల్పాం సాగుపై వీరిలో చైతన్యం తేవాలని సూచించారు. ఆర్వోఎఫ్ఆర్ భూముల్లో ఆయిల్పాం సాగును ప్రోత్సహించాలన్నారు. వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. విజయనిర్మల, అనిత, సందీప్కుమార్, నగేశ్, వేణు, పీ.అపర్ణ, కే.మీనాక్షి, నాగమణి, ఆయిల్ఫెడ్ డివిజనల్ అధికారి ఏ.బాలకృష్ణ, గోద్రెజ్ కంపెనీ ఏరియా మేనేజర్ రామకృష్ణ, ఫీల్డ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.