ఖమ్మం, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి ఖమ్మం జిల్లాను సమస్యలు లేని జిల్లాగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రహదారులు, భవనాలు, సినిమాటోగ్రఫీ, రెండు జిల్లాల ఇన్చార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ‘ప్రజాపాలన’ అమలుపై మంగళవారం ఖమ్మం నగర పరిధిలోని కలెక్టరేట్లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజు నుంచే ఎన్నికల మ్యానిఫెస్టోను అమలు చేయడం ప్రారంభించిందన్నారు. దీనిలో భాగంగానే 28 నుంచి జనవరి 6 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన గ్రామసభలు నిర్వహిస్తామన్నారు. రెండు జిల్లాల్లో విస్తరణకు వీలున్న రహదారులను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ఎన్నికల సమయలో హామీలు అమలు చేసి తీరుతామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీల స్కీములకు క్యాబినెట్ మీటింగ్లో చట్టబద్ధత కల్పించామన్నారు.
ఆర్థిక పరమైన సమస్యలను అధిగమించి స్కీములను అమలు చేస్తామన్నారు. ఈనెల 28 నుంచి ‘ప్రజాపాలన’ పేరుతో గ్రామ గ్రామాన గ్రామసభలు నిర్వహిస్తామన్నారు. ప్రజల నుంచి దరఖాస్తు స్వీకరించి వారికి రశీదులు అందిస్తామన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ప్రజాపాలనలో భాగంగా ప్రజల నుంచి మొక్కుబడిగా దరఖాస్తులు తీసుకోవడం లేదని, ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. జిల్లాలో నాగపూర్ – అమరావతి వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే, ఖమ్మం -రాజమండ్రి హైవే, కోదాడ -కురవి హైవే పనులను సత్వరం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కొత్తగూడెం -వలిగొండ జాతీయ రహదారి పనులు పూర్తి చేసేందుకు సహకారం అందించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి వెంకటరెడ్డిని ఆయన కోరారు. సమావేశంలోభద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి న్నారు.