‘ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం.. సీఎం కేసీఆర్ దార్శనికతతో రాష్ర్టాన్ని అభివృద్ధి బాట పట్టిస్తున్నారు.. ఇదే బాటలో ఖమ్మం జిల్లా పయనిస్తున్నది.. అభివృద్ధి, సంక్షేమంలో జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుస్తున్నది.. ప్రజాప్రతినిధులు, అధికారులు నిబద్ధత, సమన్వయంతో పనిచేయడంతోనే ఈ విజయం సాధ్యమైంది.. జిల్లాపై అభిమానంతోనే సీఎం కేసీఆర్ మెడికల్ కళాశాల మంజూరు చేశారు.. ఏర్పాట్లకు వెంటనే రూ.166 కోట్ల నిధులు విడుదల చేశారు.. దళితబంధు పథకంలో భాగంగా చింతకాని మండలంలో వేలాది మందికి యూనిట్లు మంజూరు చేశారు. జిల్లా ఆసుపత్రిలో రూ.2.15 కోట్లతో సీటీ స్కాన్ విభాగాన్ని జిల్లా ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1-8వ తరగతి విద్యార్థులకు ఆంగ్ల విద్యను అందిస్తున్నారు.. ఈ సీజన్లో 3.15 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.356.27 కోట్ల రైతుబంధు సాయం జమ చేశారు..’ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో సోమవారం ఆయన కలెక్టర్ గౌతమ్, ఎస్పీ విష్ణు ఎస్ వారియర్తో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ఖమ్మం నగరపాలక సంస్థ ‘బెస్ట్ గ్రీన్ సిటీ’ అవార్డు దక్కించుకోవడం అభినందనీయమన్నారు.
ఖమ్మం, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా అగ్రగామిగా నిలిచిందని, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడమే ప్రధాన లక్ష్యంగా సీఎం కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్లో జరిగిన వేడుకల్లో మంత్రి అజయ్ పోలీసు వందనం స్వీకరించి జాతీయజెండాను ఎగురవేశారు. అనంతరం జిల్లా అభివృద్ధిపై ఆయన ప్రసంగించారు. జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారుల నిబద్ధత, సమన్వయమే జిల్లా అగ్రగామిగా నిలువడానికి ప్రధాన కారణమన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన సమరయోధులకు నివాళులర్పించారు. ఎందరో యోధుల త్యాగాల ఫలితం వల్లనే మనకు స్వాతంత్య్రం సిద్ధించిందని, అందువల్లనే మనం స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామని గుర్తుచేశారు. వజ్రోత్సవాల్లో భాగంగా వన మహోత్సవం, ఫ్రీడం పార్కుల ఏర్పాటు, ఫ్రీడం రన్, జాతీయ సమైక్య రక్షాబంధన్, ర్యాలీలు, జానపద కళా ప్రదర్శనలు, సామూహిక జాతీయ గీలాపన, కవి సమ్మేళనం, రక్తదాన శిబిరాలు, ఫ్రీడం కప్ ఆటల పోటీలు, ఆసుపత్రిల్లో వృద్ధ, అనాథ ఆశ్రమాలు, జైళ్లలో పండ్లు, స్వీట్ల పంపిణీ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు.
ఖమ్మానికి మెడికల్ కళాశాల..
ఖమ్మం జిల్లాకు సీఎం కేసీఆర్ ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేశారని, అందుకోసం రూ.166 కోట్లను విడుదల చేశారని మంత్రి పేర్కొన్నారు. జిల్లా ఆసుపత్రిలో రూ.2.15 కోట్లతో సీటీ స్కాన్ను జిల్లా ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. జిల్లాలో 104 సబ్ సెంటర్లను పల్లె దవాఖానలుగా అప్గ్రేడ్ చేశామన్నారు. నగరంలోనూ రెండు బస్తీ దవాఖానలను ప్రారంభించామన్నారు. జిల్లాలో ఈ ఏడాది నుంచి అన్ని విద్యాసంస్థల్లో ఒకటి నుంచి ఎనిమిది తరగతుల వరకు ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టామన్నారు. 9,659 మంది బడి బయటి పిల్లలను బడిలో చేర్పించినట్లు వివరించారు. ‘మన ఊరు/ మన బస్తీ – మన బడి’ కార్యక్రమాల్లో మొదటి విడతగా 426 పాఠశాలలను ఎంపిక చేసి వాటిల్లో మౌలిక వసతులను ఏర్పాటు చేసినట్లు వివరించారు. 3,15,772 మంది రైతులకు రైతుబంధు కింద రూ.356.27 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో 15 రోజులపాటు జిల్లా వ్యాప్తంగా నిర్వహించామన్నారు.
దళితసాధికరత కోసమే దళితబంధు..
దళిత సాధికారత, ఆర్థిక అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారని మంత్రి అజయ్కుమార్ పేర్కొన్నారు. చింతకాని మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి 3,434 మంది లబ్ధిదారులను గుర్తించామన్నారు. మొదటి విడతగా రూ.100 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని, 282 మందికి రూ.10 లక్షల చొప్పున మంజూరు చేసిందని వివరించారు. నియోజకవర్గానికి 100 చొప్పున జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 500 యూనిట్లు కేటాయించి మొదటి విడతగా రూ.40 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు.
ఖమ్మానికి బెస్ట్ గ్రీన్ సిటీ అవార్డు..
తెలంగాణ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ద్వారా రాష్ట్ర స్థాయిలో ఖమ్మం నగరం బెస్ట్ గ్రీన్ సిటీ అవార్డు సాధించడం సంతోషంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. అభివృద్ధిలో ఖమ్మం నగరానికి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చామన్నారు.
సాతంత్య్ర సమరయోధులకు సత్కారం
వజ్రోత్సవాల సందర్భంగా ఖమ్మంలోని పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ.. పలువురు స్వాతంత్య్ర సమరయోధులను శాలువాతో సత్కరించారు. ఎమ్మెల్సీ తాతా మధు, కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్, కేఎంసీ మేయర్ నీరజ, సుడా చైర్మన్ విజయ్కుమార్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, రైతుబంధు సమితి అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, అదనపు కలెక్టర్లు మధుసూదన్, స్నేహలత మొగిలి, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలు చంద్రావతి, పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.