ఖమ్మం, జనవరి 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రానున్న లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సమరశంఖం పూరిస్తున్నది.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన లోటుపాట్లను అధిగమించి.. సమష్టిగా పనిచేసి విజయఢంకా మోగించేందుకు సిద్ధమవుతున్నది. ఈ మేరకు పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా లోక్సభా స్థానాలకు చెందిన పార్టీ శ్రేణులతో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మంగళవారం ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశం జరుగనున్నది. ఉమ్మడి జిల్లాలో మొత్తం పది శాసనసభ స్థానాలు ఉండగా ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గంలో ఖమ్మం, పాలేరు, వైరా, మధిర, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో భద్రాచలం, పినపాక, ఇల్లెందు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.
ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశానికి ఉమ్మడి జిల్లాలోని పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల ఇన్చార్జులు, ఉభయ జిల్లాల పార్టీ అధ్యక్షులతోపాటు మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ఉభయ జిల్లాల జిల్లా పరిషత్చైర్మన్లు లింగాల కమల్రాజు, కంచర్ల చంద్రశేఖర్రావు, మాజీ శాసన సభ్యులు కందాళ ఉపేందర్రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, రాములునాయక్, బానోతు మదన్లాల్, మెచ్చా నాగేశ్వరరావు, వనమా వెంకటేశ్వరరావు పాల్గొననున్నారు. మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశం ఈ నెల 11న హైదరాబాద్లోనే జరుగనున్నది.
ఖమ్మం లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఖమ్మం, పాలేరు, వైరా, మధిర, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపై అధిష్ఠానం సమీక్షించనున్నది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 100 మంది చొప్పున సుమారు 700 మంది సమావేశానికి హాజరు కానున్నారు. వీరిలో ముఖ్య నేతలు, నాయకులు, ప్రజాప్రతినిధుల నుంచి ద్వితీయశ్రేణి నాయకులు ఉంటారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం లోక్సభ స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రేణుకా చౌదరిపై నామా నాగేశ్వరరావు అత్యధిక మెజార్టీతో గెలుపొంది విజయ బావుటా ఎగురవేశారు. అలాగే ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, సహకార సంఘాల ఎన్నికల్లోనూ గులాబీదే పైచేయి.
ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో పార్టీకి చేదు ఫలితాలు ఎదురయ్యాయి. అయినా పార్టీ కేడర్ మాత్రం చెక్కు చెదరలేదు. అదే విధంగా ఖమ్మం లోక్సభ నియోజకవర్గ పరిధిలోనూ ఏ పార్టీకి లేనంత బలమైన కేడర్ ఒక్క బీఆర్ఎస్కే ఉంది. పార్టీ శ్రేణుల్లో నెలకొన్న నిరాశ, నిస్పృహలను తొలగించేలా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు నూతనోత్సాహాన్ని నింపనున్నారు. గత ఎన్నికల్లో లభించిన ఫలితాలను బేరీజు వేసుకుని ఈసారి లోక్సభల్లో అనుసరించాల్సిన విధానాలపై దిశానిర్దేశం చేయనున్నారు. లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు, పార్టీ శ్రేణులను కార్యోన్ముఖులను చేసే విధంగా ఆయన ప్రసంగం సాగనున్నది.