సత్తుపల్లి టౌన్, నవంబర్ 9: ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ఖమ్మం ఎంపీ, సత్తుపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ విజయం కోసం ఈ 20 రోజులపాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు శక్తివంచన లేకుండా పనిచేయాలని పిలుపునిచ్చారు. సత్తుపల్లి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న సండ్ర వెంకటవీరయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ సందర్భంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దీనికి ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుత ఎమ్మెల్యే సండ్ర తన నామినేషన్ పత్రాలను జవహర్నగర్ చర్చీ, అయ్యగారిపేట ఆంజనేయస్వామి ఆలయం, పాత సెంటర్ జామే మసీదుల్లో ఉంచి కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు, ప్రార్థనలు, నమాజులు చేశారు. తరువాత నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి ఆర్వోకు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు మాట్లాడుతూ.. సండ్ర వెంకటవీరయ్య భారీ మెజార్టీతో గెలవడం తథ్యమని అన్నారు. మరో రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజల కోసం కష్టపడి పనిచేసే వ్యక్తిత్వం ఉన్న సండ్ర వెంకటవీరయ్యను అందరమూ కలిసి గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ.. కొన్ని వ్యతిరేక శక్తులు చేసే తప్పుడు ప్రచారాలను బీఆర్ఎస్ కార్యకర్తలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. తనకు అధిక మెజార్టీ అందించాలని కోరారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు కొత్తూరు ఉమామహేశ్వరరావు, కూసంపూడి మహేశ్, వనమా వాసు, దొడ్డా హైమావతి, కూసంపూడి రామారావు, యాగంటి శ్రీనివాసరావు, మట్టా రమేశ్, మట్టా ప్రసాద్, వీరపనేని రాధికాబాబి, నరుకుళ్ల మమత, షేక్ చాంద్పాషా, తడికమళ్ల ప్రకాష్రావు, గఫార్, షేక్ రఫీ, మల్లూరు అంకమరాజు, వల్లభనేని పవన్, అద్దంకి అనిల్ తదితరులు పాల్గొన్నారు. సండ్ర నామినేషన్ సందర్భంగా సత్తుపల్లి పట్టణమంతా గులాబీమయమైంది.