కొణిజర్ల, అక్టోబర్ 8 : వరంగల్లో ఈనెల 16న సీఎం కేసీఆర్ విడుదల చేసే బీఆర్ఎస్ మ్యానిఫెస్టోతో ప్రతిపక్షాలకు దిమ్మతిరగడం ఖాయమని, రాష్ట్ర ప్రజలకు ఏమి కావాలో సీఎం కేసీఆర్కు తెలుసని, ఢిల్లీలో ఉండే కాంగ్రెస్ గులాములకు ఏమి తెలుసని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రశ్నించారు. మంగాపురంలోని డీవీఆర్.ఫంక్షన్ హాల్లో కొణిజర్ల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. తొలుత సిద్ధినగర్ క్రాస్ రోడ్డు నుంచి మంగాపురం వరకు ఎంపీ నామా, వైరా ఎమ్మెల్యే రాములునాయక్, మాజీ ఎమ్మెల్యే మదన్లాల్కు పూలవర్షం, భారీ ద్విచక్ర వాహన ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమ్మేళనంలో ఎంపీ నామా మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్లో అత్యధిక మెజార్టీ సాధించిన మండలం కొణిజర్ల అని, రాజకీయ చైతన్యం కలిగిన మండలంపై తనకు అభిమానం ఎక్కువ అని అన్నారు. ఓ వైపు ఖమ్మం నగరానికి, మరోవైపు వైరా నియోజకవర్గ కేంద్రానికి సమీపంలో ఉన్న కొణిజర్ల మండలం క్రియాశీలకమైందన్నారు. స్థానికంగా బలమైన నాయకత్వం ఉన్న కొణిజర్ల మండలంలో ఈసారి కారు గుర్తుకు అత్యధిక మెజార్టీ రావాలని ఆకాంక్షించారు. ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పెద్ద పెద్ద పోస్టర్లు ఏర్పాటు చేసిందని, ఢిల్లీలో ఉండే కాంగ్రెస్ గులాములకు ప్రజావసరాలు ఏమి తెలుసన్నారు. తొమ్మిదేళ్లలో దేశంలో ఎక్కడా లేని ప్రగతిని తెలంగాణ రాష్ట్రం సాధించిందన్నారు. రైతుబిడ్డగా ప్రభుత్వ విధానాలను గర్విస్తున్నానని, రూ.73 వేల కోట్లు రైతుబంధు అందించిన చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మూడోసారి కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం ఖాయమని, మదన్లాల్ను బంపర్ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ మరోమారు విజయ ఢంకా మోగించి హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయమని ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. గత ఎన్నికల్లో తనకు, మదన్లాల్కు కలిపి లక్ష పైచిలుకు ఓట్లు పోలయ్యాయని, ఇప్పుడు ఇద్దరం కలిసి పనిచేస్తున్నందున అంతకు మించి ఓట్లు కారు గుర్తుకు పోల్ కావాలని, 50వేల పైచిలుకు మెజార్టీ సాధించేలా కార్యకర్తలంతా కృషి చేయాలన్నారు. రాష్ట్ర సమస్యలను పార్లమెంట్లో నిత్యం ప్రస్తావించే నామా నాగేశ్వరరావు నాయకత్వంలో వైరా నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురనున్నదని, మదన్లాల్ అభ్యర్థిత్వానికి తాను పూర్తిగా మద్దతు ఇస్తానన్నారు.
ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తే మిగిలిన ఉన్న సమస్యలను పరిష్కరించి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని, తన శక్తి మేర ప్రతి ఒక్కరినీ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని వైరా బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మదన్లాల్ పేర్కొన్నారు. చిన్నచిన్న విభేదాలను పక్కన పెట్టి శక్తికి మించి పని చేయాలన్నారు. చైతన్యవంతమైన కొణిజర్ల మండలంలో బీఆర్ఎస్ నాయకత్వం, ఓటర్లు విజ్ఞతతో ఆలోచించి పనిచేసే ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. రైతుబంధు జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రైతు సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ సారథ్యంలో మాత్రమే కొనసాగుతున్నాయని, అందుకే దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వై.చిరంజీవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, జడ్పీటీసీ పోట్ల కవిత, వైస్ ఎంపీపీ డేరంగుల వెంకటరమణ, కిలారు మాధవరావు, చెరుకుమల్లి రవి, పోట్ల శ్రీను, బోడపోతుల బాబు, డేరంగుల బ్రహ్మం, పాముల వెంకటేశ్వర్లు, కిలారు కిరణ్, దొడ్డపునేని రామారావు, చల్లగుండ్ల బుజ్జి, జడ మల్లేశ్, సాయిన్ని నర్సయ్య, బండారు కృష్ణ, షేక్ మౌలాన, సర్పంచ్లు చల్లా మోహన్రావు, కొర్రా కాంతమ్మ, షేక్ అఫ్జల్బీ, రాయల నాగేశ్వరరావు, మాన్సింగ్, రోషన్బేగ్, చిరంజీవి, నాయకులు బూర ప్రసాద్, చల్లగుండ్ల రమేశ్, దావా విజయ్, అనుమోలు శ్రీనివాసరావు, వడ్లముడి శివ, రావుల వెంకటయ్య, భుక్యా మీటు, భుక్యా రాంలాల్, గోదె కృష్ణ, షేక్ దాదా సాహెబ్, దరావత్ బాబులాల్, చల్లా నర్సింహారావు, నల్లపాటి నర్సింహారావు, రవిచంద్ర, మట్టా బాబు తదితరులు పాల్గొన్నారు.